వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు

- June 03, 2026 , by Maagulf
వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు

-సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, సీఎంసీ కమిషనర్ సృజన సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన

సైబరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో రోడ్లపై వరద నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, మునిసిపల్ కమిషనర్ సృజనతో కలిసి సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి, వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలను పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించి అవసరమైన చర్యలపై సూచనలు చేశారు.

ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని మల్కం చెరువు–బయోడైవర్సిటీ జంక్షన్ సమీపంలోని కేర్ హాస్పిటల్ వద్ద భారీ వర్షాల సమయంలో రోడ్లపై వరద నీరు చేరుతున్న ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్, కొండాపూర్‌లోని హర్ష టయోటా షోరూం జంక్షన్ తదితర ప్రాంతాల్లో వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు మునిసిపల్ అధికారులు, పోలీసులు, ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తగ్గడంతో పాటు ట్రాఫిక్ అంతరాయాలు నివారించబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, కూకట్‌పల్లి డీసీపీ రిత్‌రాజ్, ఏడీసీపీ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com