పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- June 04, 2026
హైదరాబాద్: హైదరాబాద్, అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తిని చాటిన పారా-అథ్లెట్లను సత్కరించేందుకు బేగంపేటలో ఉన్న ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ & రిహాబిలిటేషన్ సెంటర్లో ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా విచ్చేశారు. పారా-అథ్లెట్లను సత్కరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు వీలుగా కృత్రిమ అవయవాలు, క్రీడా పరికరాలు, స్కాలర్షిప్లు, స్పాన్సర్ షిప్లు, ఇతర సహాయక సామగ్రిని గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు నూతన అవకాశాలను సృష్టించడంలో ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సమగ్రమైన మౌలిక సదుపాయాలు, పునరావాస సేవలు, నాణ్యమైన శిక్షణ, సమాన అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పారా-అథ్లెట్లను ప్రోత్సహించడంలో, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా మద్దతు ఇవ్వడంలో ఫౌండేషన్ కృషిని అభినందించారు. దీని ద్వారా రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు.
పారా ఛాంపియన్లకు ఘన సన్మానం
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పారా-అథ్లెట్లకు రూ.3.46 కోట్ల విలువైన సహాయాన్ని అందించింది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం కోసం రూ.1.78 కోట్లు కేటాయించారు. ఇండియన్ పారా సైక్లింగ్ టీమ్, ఇండియన్ పారా షూటింగ్ టీమ్, ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్ల కోసం సిద్ధమవుతున్న ఇతర ప్రతిభావంతులైన పారా-అథ్లెట్లకు అందించిన మద్దతు కూడా ఇందులో ఉంది. దీనికి తోడు వివిధ రాష్ట్రాలకు చెందిన పారా-అథ్లెట్లు ఉన్నత స్థాయి శిక్షణ పొందడానికి, పోటీలలో రాణించడానికి వీలుగా రూ.1.68 కోట్ల విలువైన అడాప్టివ్ స్పోర్ట్స్ పరికరాలు, ప్రత్యేకంగా తయారు చేసిన కృత్రిమ అవయవాలు, సైకిళ్లు, హ్యాండ్ సైకిళ్లు, శిక్షణా పరికరాలు, ఇతర సహాయక సాధనాలు పంపిణీ చేశారు. అంతర్జాతీయ పారా-క్రీడలలో అసాధారణమైన సహకారం, విజయాలు సాధించిన ప్రముఖ పారా-అథ్లెట్ల బృందాన్ని కూడా ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది. పారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతదేశపు మొట్టమొదటి పురుష పారా-సైక్లిస్ట్ అర్షద్ షేక్, పారా-సైక్లింగ్లో విశేష విజయాలు సాధించిన లిషా దాస్, విశ్వ వసాని, పారా-అథ్లెటిక్స్లో రాణించిన హెచ్ యూ శివాని, జ్యోతి, అంతర్జాతీయ స్థాయిలో హ్యాండ్ సైక్లింగ్లో అద్భుత విజయాలు సాధించిన ప్రశాంత్ ఈ సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
క్రీడాకారులకు భారీ ఆర్థిక భరోసా
ఈ వేడుకలో దాత, ఫ్యాషన్ డిజైనర్, ఆదిత్య మెహతా ఫౌండేషన్ ట్రస్టీ శిల్పా రెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ (ఆంధ్రప్రదేశ్) ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి & మెట్రోపాలిటన్ ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ జయేష్ రంజన్, ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆదిత్య మెహతా ఫౌండేషన్ ట్రస్టీ అంజనా సిన్హా, సినీ నటి మంచు లక్ష్మి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ డాక్టర్ ఏ సోనిబాల దేవి, ఆదిత్య మెహతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆదిత్య మెహతా పాల్గొన్నారు. అథ్లెట్లు అత్యున్నత స్థాయిలో రాణించడానికి భాగస్వాముల సహకారం ఎంతో ఉంది. ఇన్వెస్కో, ఆల్కాన్, జీఎంఎంసీఓ, ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్, ఫ్లట్టర్ ఎంటర్టైన్మెంట్ ఇండియాకు ఆదిత్య మెహతా కృతజ్ఞతలు తెలిపింది. ఆదిత్య మెహతా ఫౌండేషన్ గురించి ఆదిత్య మెహతా ఫౌండేషన్ హైదరాబాద్ కేంద్రంగా పని చేసే లాభాపేక్ష లేని సంస్థ. ఇది క్రీడలు, పునరావాసం, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా దివ్యాంగుల సాధికారత కోసం అంకితభావంతో పని చేస్తోంది. వినూత్న కార్యక్రమాలు, భాగస్వామ్యాల ద్వారా వేలాది మంది స్వతంత్రంగా, గౌరవప్రదంగా, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ ఫౌండేషన్ నిరంతరం నూతన అవకాశాలను సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









