నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు

- June 04, 2026 , by Maagulf
నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న వేళ, విమానయాన రంగం కీలక మలుపు వద్ద నిలిచింది—ఒకవైపు ఆర్థికాభివృద్ధికి ఇంధనంగా కొనసాగుతూ, మరో వైపు భావితరాల పట్ల తన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఏర్పడింది.ఈ నేపథ్యంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) సుస్థిరతను తన ప్రధాన కార్యాచరణగా ఎంచుకుంది. స్కోప్ 1 మరియు స్కోప్ 2 పరిధిలో నెట్ జీరో కార్బన్ ఉద్గారాలను నిర్దేశిత లక్ష్యానికి చాలా ముందుగానే సాధించడంతో పాటు, కార్యకలాపాలు, మౌలిక వసతులు, సాంకేతికత మరియు సమాజ భాగస్వామ్యంలోని ప్రతి అంశంలో సుస్థిరతను సమగ్రంగా అమలు చేస్తూ, భవిష్యత్‌కు సిద్ధమైన బాధ్యతాయుత విమానయాన సంస్థగా RGIA తనదైన గుర్తింపును సృష్టించింది.

సుస్థిర విమానయాన పర్యావరణ వ్యవస్థ నిర్మాణంలో GHIAL పాత్ర

RGIA కేవలం ప్రయాణికులు మరియు కార్గోకు గేట్‌వే మాత్రమే కాదు.GHIAL యొక్క డీకార్బనైజేషన్ వ్యూహం రెండు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది:

  • ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం–13 (వాతావరణ చర్యలు): వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలపై అత్యవసర, కొలిచే విధమైన చర్యలు.
  • ICAO దీర్ఘకాలిక గ్లోబల్ లక్ష్యం–2050: పారిస్ ఒప్పందానికి అనుగుణంగా విమానయాన రంగాన్ని నెట్ జీరో కార్బన్ దిశగా నడిపించడం.

GHIAL ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 16 లక్ష్యాలకు అనుసంధానమై, పర్యావరణం, సామాజిక బాధ్యత మరియు పరిపాలనా (ESG) ప్రమాణాలను విమానాశ్రయ కార్యకలాపాల ప్రతి స్థాయిలో అమలు చేస్తోంది.

ఈ క్రమంలో విమానాశ్రయం తన నెట్ జీరో వ్యూహాన్ని రెండు స్పష్టమైన దశలుగా విభజించింది—2035 నాటికి స్కోప్ 1 మరియు స్కోప్ 2 ఉద్గారాలపై నెట్ జీరో సాధించడం, అలాగే 2050 నాటికి స్కోప్ 3 ఉద్గారాలపై నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడం. ఈ లక్ష్యాలు ICAO, IATA మరియు ACI మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.

అయితే GHIAL ఈ లక్ష్యాలను నిర్దేశించడమే కాకుండా వాటిని ముందుగానే సాధించింది. RGIA 2024లోనే స్కోప్ 1 మరియు స్కోప్ 2 పరిధిలో నెట్ జీరో కార్బన్ స్థాయిని సాధించి, అసలు లక్ష్యంగా నిర్దేశించిన 2035 కంటే 11 సంవత్సరాల ముందుగానే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

సుస్థిర మార్పుకు బహుముఖ కార్యక్రమాలు

  •  GHIAL సుస్థిరత అనేది ఒకే కార్యక్రమానికి పరిమితమైనది కాదు. ఇది శక్తి వినియోగం, నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ మరియు సమాజాభివృద్ధి వంటి అనేక అంశాలను పరస్పర అనుసంధానించే సమగ్ర పర్యావరణ వ్యవస్థ.

గ్రీన్ బిల్డింగ్స్ – టెర్మినల్ స్థాయిలో ప్రపంచ ప్రమాణాల సుస్థిరత

  • RGIA ప్రయాణికుల టెర్మినల్ భవనం 2025లో అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (USGBC) నుంచి LEED ప్లాటినం సర్టిఫికేషన్ పొందింది. సుస్థిర నిర్మాణ రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత గుర్తింపుల్లో ఇది ఒకటి.
  • ఈ గుర్తింపు టెర్మినల్‌లో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, అంతర్గత గాలి నాణ్యతను మెరుగుపరచడం, పర్యావరణహిత నిర్మాణ పదార్థాల వినియోగం మరియు నీటి సంరక్షణలో అవలంబించిన సమగ్ర విధానానికి ప్రతిబింబంగా నిలుస్తుంది.
  •  ఈ టెర్మినల్ నేటి ప్రయాణికుల అవసరాలను మాత్రమే కాకుండా, రాబోయే దశాబ్దాల్లో పర్యావరణంపై ప్రభావాన్ని కనిష్ట స్థాయిలో ఉంచేలా రూపుదిద్దుకుంది.

ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ – భారతదేశంలో అత్యున్నత గుర్తింపు పొందిన విమానాశ్రయాల్లో ఒకటి

  • 2025లో RGIA, ACI Airport Carbon Accreditation Level–5 గుర్తింపును సాధించింది. ఈ కార్యక్రమంలో ఇది అత్యున్నత స్థాయి గుర్తింపుగా పరిగణించబడుతుంది.
  • CY 2025లో విమానాశ్రయం మొత్తం 54,168 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమాన (tCO₂e) ఉద్గారాలను నివారించింది.

 100 శాతం హరిత విద్యుత్ వినియోగానికి మార్పు

  • ప్రస్తుతం RGIA పూర్తిగా హరిత విద్యుత్ ఆధారంగా పనిచేస్తోంది. దీనికి ద్వంద్వ వనరుల విద్యుత్ విధానాన్ని అమలు చేసింది. విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 MWp సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న పునరుత్పాదక విద్యుత్‌తో పాటు, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (TGSPDCL) నుంచి కొనుగోలు చేస్తున్న గ్రీన్ పవర్‌ను వినియోగిస్తోంది.
  • ఈ చర్యల ఫలితంగా స్కోప్–2 ఉద్గారాలు పూర్తిగా శూన్యానికి చేరుకున్నాయి. 2025లో GHIAL మొత్తం విద్యుత్ వినియోగంలో 13 శాతం అవసరాన్ని ప్రాంగణంలోని సౌర విద్యుత్ ద్వారానే తీర్చుకుంది.దీంతో గ్రిడ్‌పై ఆధారపడటం తగ్గడమే కాకుండా రూ. 96,982,003 వరకు వ్యయ ఆదా నమోదైంది.

టెర్మినల్ మరియు ఎయిర్‌సైడ్ కార్యకలాపాల్లో శక్తి సామర్థ్య పెంపు

  • RGIA తన కార్యకలాపాల ప్రతి స్థాయిలో శక్తి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చే చర్యలను అమలు చేస్తోంది. ప్రయాణికుల టెర్మినల్ అంతటా సంప్రదాయ లైటింగ్ వ్యవస్థలను పూర్తిగా LED సాంకేతికతతో భర్తీ చేయడం ద్వారా గణనీయమైన విద్యుత్ ఆదాను సాధించింది. ప్రయాణికుల అనుభవాన్ని ఏమాత్రం ప్రభావితం చేయకుండా ఈ మార్పు అమలు చేయబడింది.
  • అదేవిధంగా, టెర్మినల్‌లోని HVAC (Heating, Ventilation and Air Conditioning) వ్యవస్థలు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా డైనమిక్‌గా నిర్వహించబడుతున్నాయి. అధిక సామర్థ్యంతో పనిచేసే చిల్లర్ ప్లాంట్లు మరియు కూలింగ్ టవర్లు వాస్తవ సమయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి.
  • ఎయిర్‌సైడ్ కార్యకలాపాల్లో కూడా కార్బన్ తగ్గింపు చర్యలు అమలు చేయబడ్డాయి. డీజిల్ జనరేటర్లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఫాస్ట్ బస్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ (FBTS) ప్రవేశపెట్టబడింది. అదనంగా, సంప్రదాయ ఇంధన ఆధారిత గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్ (GSE) స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ మార్పును మరింత వేగవంతం చేయడానికి ఎయిర్‌సైడ్ ప్రాంతంలో 5 MWp సామర్థ్యంతో ప్రత్యేక విద్యుత్ ఛార్జింగ్ మౌలిక వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. దీంతో విమానయాన సంస్థలు మరియు గ్రౌండ్ హ్యాండ్లింగ్ భాగస్వాములు తమ కార్యకలాపాలను ఎలక్ట్రిక్ ఆధారిత వ్యవస్థలకు మార్చుకునే అవకాశాన్ని పొందుతున్నాయి.

విమాన ఉద్గారాల తగ్గింపుకు సుస్థిర ఎయిర్‌సైడ్ చర్యలు

  • సింగిల్ ఇంజిన్ టాక్సీయింగ్ విధానంతో జెట్ ఇంధన వినియోగం తగ్గించబడుతోంది.
  • గేట్ల వద్ద ఏర్పాటు చేసిన Bridge Mounted Equipment (BME), Fixed Electrical Ground Power Units (FEGPU), Pre-Conditioned Air (PCA) ద్వారా విమానాలు Auxiliary Power Units (APUs) వినియోగం లేకుండా గ్రౌండ్ పవర్ పొందుతున్నాయి.
  • CY2025లో ఈ చర్యల ద్వారా 19,485 టన్నుల CO₂e ఉద్గారాలు తగ్గించబడ్డాయి.
  • Airport Collaborative Decision Making (A-CDM) ద్వారా విమాన టర్న్‌రౌండ్ సామర్థ్యం మెరుగుపడింది.
  • భారతదేశంలో తొలిసారిగా, ఎలక్ట్రిక్ వాహనంపై ఆధారిత మొబైల్ ఎన్విరాన్‌మెంటల్ ప్యారామీటర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేసింది.
  • భారత విమానాశ్రయ రంగంలో తొలి ప్రయత్నంగా రూపొందించిన GSE టన్నెల్, భూభాగ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచి, సంవత్సరానికి సుమారు 124 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తోంది.

నీటి సంరక్షణ–సర్క్యులర్ వాటర్ మేనేజ్‌మెంట్‌కు ఆదర్శ నమూనా

  • నీటి సంరక్షణ RGIA సుస్థిరత విధానంలో కీలక భాగంగా నిలిచింది. విమానాశ్రయం పూర్తిస్థాయి ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ విధానాన్ని అనుసరిస్తోంది. అంటే శుద్ధి చేయకుండా లేదా తిరిగి వినియోగించకుండా ఎటువంటి మురుగు నీరు వ్యవస్థ బయటకు వెళ్లకుండా చూసుకుంటోంది.
  • §  విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నాలుగు వర్షపు నీటి నిల్వ కేంద్రాలు కలిపి 10.35 లక్షల కిలోలీటర్ల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నీటిని గృహ అవసరాలకు మరియు భూగర్భ జలాల పునరుద్ధరణకు వినియోగిస్తున్నారు.
  • అదేవిధంగా, విమానాశ్రయంలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (STPs) రోజుకు 4,550 కిలోలీటర్ల నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తున్నాయి. ఈ నీటిని ఫ్లషింగ్, కూలింగ్ టవర్లు మరియు హరిత ప్రాంతాల నిర్వహణ కోసం ఉపయోగించడం ద్వారా మున్సిపల్ మరియు భూగర్భ జలాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గింది.
  • ఈ చర్యల ఫలితంగా FY 2025–26లో RGIA మొత్తం నీటి అవసరాల్లో సుమారు 59 శాతం అవసరాన్ని అంతర్గతంగా రీసైకిల్ చేసిన నీటి వనరుల ద్వారానే తీర్చుకుంది. ఈ పురోగతి భారతదేశంలోని పెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో అత్యంత సమర్థవంతమైన నీటి వినియోగ నమూనాల్లో ఒకటిగా RGIAను నిలబెడుతోంది.

కార్బన్ సింక్ అభివృద్ధి మరియు జీవవైవిధ్య పరిరక్షణ

  • సుస్థిర అభివృద్ధి దిశగా RGIA చేపట్టిన కార్యక్రమాల్లో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. విమానాశ్రయ ప్రాంగణంలో అభివృద్ధి చేసిన హరిత ప్రాంతాలు కేవలం అందాన్ని పెంచే అంశాలుగా కాకుండా, చురుకైన కార్బన్ సింక్‌లుగా పనిచేస్తున్నాయి. ఈ గ్రీన్‌బెల్ట్ వ్యవస్థ CY 2025లో సుమారు 776 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ (CO₂)ను శోషించింది.
  • ఇది కేవలం కార్బన్ తగ్గింపుకే పరిమితం కాకుండా, జీవవైవిధ్య పరిరక్షణకు కూడా కీలకంగా మారింది. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పలు రకాల వృక్షజాతులు, పక్షులు, సీతాకోకచిలుకలు, క్షీరదాలు మరియు ఉభయచర జాతులు నమోదవడం ద్వారా ఈ ప్రాంతం సహజ జీవావరణ వ్యవస్థకు మద్దతు ఇస్తోంది. 

వ్యర్థాల నిర్వహణ–ఆహార వ్యర్థాలను తిరిగి వినియోగించే చక్రాకార విధానం

  • వ్యర్థాల నిర్వహణలో కూడా RGIA సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తోంది. విమానాశ్రయంలో రోజుకు మొత్తం 14 టన్నుల సామర్థ్యంతో కేంద్రీకృత ఆర్గానిక్ వెస్ట్ కన్వర్టర్ (OWC) వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి తోడుగా రోజుకు 2 టన్నుల సామర్థ్యం కలిగిన కొత్తగా కొనుగోలు చేసిన ఏడు OWC యూనిట్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
  • విమానాశ్రయంలో ఉత్పత్తి అయ్యే ఆహార వ్యర్థాలను ఈ కేంద్రాల్లో ప్రాసెస్ చేసి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. అనంతరం ఈ ఎరువును విమానాశ్రయ ప్రాంగణంలోని హరిత ప్రాంతాల అభివృద్ధి మరియు నిర్వహణలో వినియోగిస్తున్నారు. ఈ విధానం వ్యర్థాలను తిరిగి వినియోగించే సమగ్ర చక్రాకార ఆర్థిక నమూనాకు ప్రతీకగా నిలుస్తోంది.
  • అదనంగా, బాధ్యతాయుత వినియోగం మరియు ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో RGIA పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.

నెట్ జీరో సాధన దిశగా పురోగతిని కొలవడం
గ్రీన్ హౌస్ గ్యాస్ (GHG) ఉద్గారాలు – 15 ఏళ్లలో 95 శాతం తగ్గింపు

  • నెట్ జీరో లక్ష్య సాధనలో RGIA సాధించిన పురోగతిని గణాంకాల రూపంలో పరిశీలిస్తే గణనీయమైన మార్పు కనిపిస్తుంది.
  • CY 2010లో స్కోప్ 1 మరియు స్కోప్ 2 పరిధిలో కలిపి విమానాశ్రయ మొత్తం కార్బన్ ఉద్గారాలు 28,865 tCO₂eగా నమోదయ్యాయి. ఇదే అన్ని పురోగతిని కొలిచే ప్రాథమిక ప్రమాణంగా పరిగణించబడింది.
  • అయితే తదుపరి సంవత్సరాల్లో తీసుకున్న సమగ్ర చర్యల ఫలితంగా CY 2025 నాటికి ఈ ఉద్గారాలు కేవలం 1,413 tCO₂eకు తగ్గాయి. అంటే 15 సంవత్సరాల వ్యవధిలో మొత్తం 95 శాతం తగ్గుదల నమోదైంది.
  • ఈ ప్రయాణం స్థిరంగా మరియు వేగవంతంగా కొనసాగింది. CY 2023లో 13,732 tCO₂eగా ఉన్న ఉద్గారాలు, CY 2024లో 2,395 tCO₂eకు తగ్గగా, CY 2025 నాటికి 1,413 tCO₂e స్థాయికి చేరుకున్నాయి.
  • ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు హరిత విద్యుత్ కొనుగోలు, ప్రాంగణంలోని సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్కోప్ 2 ఉద్గారాలను పూర్తిగా తొలగించడం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరియు ఎయిర్‌సైడ్ కార్యకలాపాల్లో అమలు చేసిన సాంకేతిక మార్పులే.

CY 2025లో మొత్తం నివారించిన GHG ఉద్గారాలు – 1,34,165 tCO₂e

  • విమానాశ్రయం తన ప్రత్యక్ష కార్యకలాపాల్లో మాత్రమే కాకుండా, విస్తృత స్థాయిలో కూడా కార్బన్ తగ్గింపుకు దోహదపడింది.
  • CY 2025లో RGIA అమలు చేసిన కార్యక్రమాల ద్వారా స్కోప్ 1, స్కోప్ 2 మరియు స్కోప్ 3 పరిధుల్లో కలిపి మొత్తం 1,34,165 tCO₂e ఉద్గారాలను నివారించడం సాధ్యమైంది.

స్కోప్ 3 ఉద్గారాలు–విస్తృత ప్రభావాన్ని గుర్తిస్తూ

  • స్కోప్ 3 ఉద్గారాలు అనేవి విమానాశ్రయం ప్రత్యక్ష నియంత్రణలో లేని కానీ దాని కార్యకలాపాలతో సంబంధం ఉన్న విస్తృత కార్బన్ ప్రభావాలను సూచిస్తాయి. ఇందులో విమానాల కార్యకలాపాలు, ప్రయాణికుల భూభాగ రవాణా, సరఫరా గొలుసు కార్యకలాపాలు మరియు ఇతర అనుబంధ అంశాలు ఉంటాయి.
  • CY 2024లో RGIA స్కోప్ 3 ఉద్గారాలు 22,73,521 tCO₂eగా నమోదయ్యాయి. ఇదే GHIAL స్కోప్ 3 గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలకు ప్రాథమిక స్థాయిగా నిర్ణయించబడింది.
  • 2050 నాటికి స్కోప్ 3 పరిధిలో కూడా నెట్ జీరో సాధించాలనే లక్ష్యంతో GHIAL ప్రత్యేక భాగస్వామ్య కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రయత్నాల ఫలితంగా CY 2025లో స్కోప్ 3 ఉద్గారాలు 15,10,961 tCO₂eకు తగ్గాయి.

ముగింపు: భారత గ్రీన్ విమానయాన భవిష్యత్తుకు మార్గదర్శి

చారిత్రాత్మకంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడిన విమానయాన రంగం ఇప్పుడు వాతావరణ లక్ష్యాలకు అనుగుణంగా రూపాంతరం చెందాల్సిన దశలో ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నెట్ జీరో కార్యకలాపాలను కొనసాగించడం, సుస్థిర ఆవిష్కరణలను విస్తరించడం, భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది. గత 15 సంవత్సరాల్లో ప్రత్యక్ష ఉద్గారాలను 95% తగ్గించి, స్కోప్ 1 & 2 నెట్ జీరో లక్ష్యాన్ని ముందుగానే సాధించిన RGIA, ఇప్పుడు స్కోప్ 3 డీకార్బనైజేషన్ వైపు అడుగులు వేస్తోంది.భావితరాల కోసం ప్రతి విమాన ప్రయాణం, ప్రతి టెర్మినల్ అనుభవం, ప్రతి నిర్వహణ నిర్ణయం పర్యావరణ బాధ్యతను ప్రతిబింబించేలా కొత్త తరానికి అనువైన విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com