కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..

- July 26, 2026 , by Maagulf
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..

న్యూ ఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన విద్యాశాఖ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికి శాఖ కార్యకలాపాలపై వివరించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పూర్తి వినయంతో, అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. దేశ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ రాజీనామాను ఆమోదించారు. అనంతరం ప్రధాని సిఫారసు మేరకు ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో ఇప్పటికే ఆహార, ప్రజాపంపిణీ మరియు ఇతర శాఖలను నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషి.. ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఆయన తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com