పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- June 06, 2026
యూఏఈ: యూఏఈలో వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున జూనియర్ స్పోర్ట్స్ శిక్షణ పై ఆందళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్ వంటి బహిరంగ క్రీడలలో ట్రైనింగ్ సమయం మరియు పరిస్థితులపై జాగ్రత్తగా దృష్టి సారించి షెడ్యూల్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. క్రమబద్ధమైన శిక్షణ పిల్లలు శారీరకంగా బలంగా మారడానికి మరియు అలవాటు పడటానికి సహాయపడుతుందని ప్రొఫెషనల్ కోచ్లు వాదిస్తున్నప్పటికీ, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో జరిగే శిక్షణా సెషన్ల తీవ్రత గురించి కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, ఈ చర్చ యూఏఈ క్రీడా వర్గాలలో విస్తృత ఆందోళనకు కారణమవుతోంది.
శిక్షణ మరియు వేడిని తట్టుకునే సామర్థ్యం మధ్య సమతుల్యం
కొంతమంది కోచ్ల ప్రకారం, వేసవి నెలల్లో బహిరంగ క్రీడలకు పూర్తిగా దూరంగా ఉండటం సరైన పరిష్కారం కాదు. సరిగ్గా నిర్వహించినప్పుడు, నియంత్రిత పద్ధతిలో క్రీడలను కొనసాగించడం దీర్ఘకాలిక అథ్లెటిక్ అభివృద్ధికి కీలకం అని వారు నమ్ముతారు. "వేడి మరియు నీటి విషయంలో జాగ్రత్త ముఖ్యం అయినప్పటికీ, మనం తరచుగా అనుకున్నదానికంటే పిల్లలు ఎక్కువ తట్టుకోగలరు." అని దేశంలో జూనియర్ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న టెన్నిస్ కోచ్ అలెక్సీ వోల్కోవ్ అన్నారు.
"సరైన ప్రణాళిక, క్రమమైన కండిషనింగ్ మరియు పర్యవేక్షణతో, తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో శిక్షణ ఇవ్వడం పూర్తిగా నిర్వహించవచ్చు. వేడిగా ఉండే సమయాల్లో బహిరంగ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండటం పిల్లల శారీరక అభివృద్ధిని మరియు నిజమైన మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మారే వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఇక్కడ కీలకం ఆంక్షలు కాదు, క్రమబద్ధమైన పద్ధతిలో క్రీడలను కొనసాగించడం మరియు తీవ్రతను తెలివిగా నిర్వహించడం." అని పేర్కొన్నారు.
అయితే, మోల్డోవా నివాసి అయిన ఇంగా పోపెస్కూ వంటి తల్లిదండ్రులకు, ఆట మైదానంలో వారి ప్రత్యక్ష అనుభవం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. తన కొడుకు కొన్నిసార్లు పగటిపూట అత్యంత వేడిగా ఉండే సమయాల్లో ఫుట్బాల్ శిక్షణ తీసుకుంటాడని, అది తనకు కొంచెం కంగారుగా అనిపిస్తుందన్నారు. తన భర్త చిన్నప్పుడు బూట్ క్యాంపులకు వెళ్ళేవారని, కాబట్టి పిల్లలు తగినంత నీరు తాగి, ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నంత కాలం, వారు మధ్యాహ్నం 12 గంటల ముందు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత ఆడినా ఫర్వాలేదని ఆయన భావిస్తారని పేర్కొన్నారు. కానీ శిక్షణ తర్వాత తన కొడుకు ఇబ్బంది పడటం చూసి తనలో ఆందోళన పెరుగుతుందన్నారు.
మిడిలీస్టులో ఎండల తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా మే నెల నుండి నా కొడుకు కేవలం గంట తర్వాతే చాలా అలసిపోవడం తాను గమనించినట్లు తెలిపారు. అతను పూర్తిగా నీరసించి తిరిగి వస్తాడుని, అది అతని శక్తిని ఎంతగా హరించివేస్తుందో చూస్తే తనకు ఆందోళనగా ఉంటుందన్నారు. పిల్లలు పెద్దలలాగా వేడిని నియంత్రించుకోలేరేమోనని తాను ఆందోళన చెందుతున్నానని ఆమె అన్నారు.
తొలి హెచ్చరిక సంకేతాలు
ఇదిలా ఉండగా, పిల్లలలో సాధారణ అలసటగా కనిపించేది కొన్నిసార్లు హీట్ స్ట్రెస్ కు తొలి సూచిక కావచ్చని యూఏఈలోని డాక్టర్లు చెబుతున్నారు. “యూఏఈలో, తీవ్రమైన వేడి మరియు తేమ ఉన్న సమయాల్లో కూడా చాలా మంది పిల్లలు ఏడాది పొడవునా ఆరుబయట శారీరకంగా చురుకుగా ఉంటారు. పిల్లల శారీరక మరియు మానసిక శ్రేయస్సుకు క్రీడలు చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ, పెద్దల కంటే పిల్లలు వేడి సంబంధిత అనారోగ్యాలకు ఎక్కువగా గురవుతారని తల్లిదండ్రులు మరియు కోచ్లు గుర్తించాలి. ఎందుకంటే వారి శరీరాలు ఉష్ణోగ్రతను అంత సమర్థవంతంగా నియంత్రించలేవు.” అని దుబాయ్లోని పీడియాట్రిక్స్ మరియు నియోనాటాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ మమతా బోత్రా హెచ్చరించారు. ముఖ్యంగా 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో వేడి ఒత్తిడికి సంబంధించిన తొలి హెచ్చరిక సంకేతాలలో అలసట లేదా పనితీరులో ఆకస్మిక తగ్గుదల అని పేర్కొన్నారు. చాలా మంది తల్లిదండ్రులు మరియు కోచ్లు పిల్లలు కేవలం అలసిపోయారని భావించవచ్చు, కానీ వాస్తవానికి శరీరం అప్పటికే అధిక వేడిని తట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండవచ్చని బోత్రా వివరించారు.
సాధారణంగా, ఉష్ణోగ్రతలు 35°C దాటినప్పుడు, ముఖ్యంగా గాలిలో తేమ 60 శాతానికి పైగా ఉన్నప్పుడు, బహిరంగ క్రీడా కార్యకలాపాలను వాయిదా వేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. యూఏఈలో వేసవి నెలల్లో మధ్యాహ్నం పూట బహిరంగ శిక్షణా కార్యక్రమాలు ముఖ్యంగా ప్రమాదకరంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనప్పుడల్లా, క్రీడా కార్యకలాపాలను తెల్లవారుజామున లేదా సూర్యాస్తమయం తర్వాత నిర్వహించడం మేలని సూచించారు. క్రీడా కార్యకలాపాల సమయంలో పిల్లలు ప్రతి 15 నుండి 20 నిమిషాలకు క్రమం తప్పకుండా నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చల్లని టవల్స్, మిస్ట్ స్ప్రేలు మరియు ఎయిర్ కండిషన్డ్ రికవరీ ప్రదేశాలు కూడా గణనీయంగా సహాయపడతాయన్నారు. వ్యాయామం తర్వాత శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడం చాలా అవసరం అని అన్నారు. తల్లిదండ్రులు నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ తీసుకునేలా ప్రోత్సహించాలని, డీహైడ్రేషన్ సంకేతాల కోసం మూత్రం రంగును గమనించాలని సూచించారు.
తల్లిదండ్రులు గమనించవలసిన విషయాలు
క్రీడల సమయంలో తల్లిదండ్రులు కేవలం ప్రదర్శనను మాత్రమే కాకుండా, వారి ప్రవర్తనలపై కూడా దృష్టి పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 5 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో నిశ్శబ్దంగా ఉండటం, చిరాకుగా ఉండటం లేదా అసాధారణంగా అలసిపోవడం వంటి లక్షణాలతోపాటు కడుపు నొప్పి లేదా తలనొప్పి ఫిర్యాదులు ఉంటాయని, కొంతమంది పిల్లలు తడబడే అవకావం ఉందని పీడియాట్రిషియన్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రాజు తెలిపారు. “11 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో తలనొప్పి, తలతిరగడం, వికారం, కండరాల నొప్పులు, గందరగోళం మరియు ఏకాగ్రత లోపం వంటివి హెచ్చరిక సంకేతాలుగా ఉంటాయి. కొంతమంది పిల్లలు లక్షణాలను దాచిపెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఒక పిల్లవాడికి ఇంకా తల తిరగనందున ఫుట్బాల్ ఆడటం కొనసాగించవచ్చు, కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా కండరాల నొప్పులు వచ్చి స్పృహ కోల్పోవచ్చు.” అని హెచ్చరించారు. పిల్లలకు వాంతులు, స్పృహ కోల్పోవడం, గందరగోళం, తడబడుతూ నడవడం లేదా తీవ్రమైన వేడిలో చెమట పట్టడం ఆగిపోతే, వెంటనే కార్యకలాపాలను ఆపివేసి, వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









