రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్‌ పోలీసుల అడ్డుకట్ట

- June 11, 2026 , by Maagulf
రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్‌ పోలీసుల అడ్డుకట్ట

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ శాఖ మరో భారీ మల్టీ-లెవెల్ మార్కెటింగ్ (MLM) కుంభకోణానికి సకాలంలో అడ్డుకట్ట వేసింది. సుమారు రూ. 5,000 కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టేందుకు వ్యూహం రచించిన ‘ఇగ్నైట్’ మనీ సర్క్యులేషన్ నెట్‌వర్క్ గుట్టును సైబర్ క్రైమ్, సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.

‘ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్’తో చెక్
ఈ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకలించేందుకు హైదరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్’ పేరుతో రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. ఈ ముఠా భారతదేశంలో తమ మోసపూరిత కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 18 రోజుల్లోనే పోలీసులు పసిగట్టడం విశేషం. దీనివల్ల వేలాది మంది అమాయక ప్రజలు ఆర్థికంగా రోడ్డున పడకుండా ముందే రక్షణ లభించింది.

పాత నేరగాళ్లే.. కొత్త రూపంలో!
గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, నిషేధానికి గురైన క్యూనెట్ (QNet), విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్‌వర్క్ నిర్వాహకులే ఈ ‘ఇగ్నైట్’ వెనుక ఉన్నట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) దర్యాప్తులో తేలింది. గత ముప్పై ఏళ్లుగా ఈ ముఠా పేర్లు మారుస్తూ ప్రజలను నిలువునా ముంచుతోంది. తొలుత గోల్డ్ క్వెస్ట్, ఆ తర్వాత క్వెస్ట్‌నెట్, క్యూనెట్, ఇప్పుడు తాజాగా ‘ఇగ్నైట్’ అవతారమెత్తి ఈ సరికొత్త మోసానికి తెరలేపినట్లు పోలీసులు నిర్ధారించారు.

బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి..
ఈ మాయాజాలంపై ముగ్గురు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి నకిలీ మనీ సర్క్యులేషన్, పొంజీ స్కీమ్స్‌లో పెట్టి మోసపోవద్దని, ఇలాంటి అనుమానాస్పద సంస్థల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com