‘సింగ్ గీతం’ టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు!

- June 11, 2026 , by Maagulf
‘సింగ్ గీతం’ టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుత ప్రయోగాలకు మారుపేరైన దిగ్గజ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాసరావు మళ్లీ మెగా ఫోన్ పట్టారు. 94 ఏళ్ల సుదీర్ఘ వయసులో ఆయన దర్శకత్వం వహించిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్‌ గీతం’. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ వినూత్న చిత్రం జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.

సింగీతం శ్రీనివాసరావు పై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. “శ్రీ సింగీతం శ్రీనివాసరావు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక భీష్మాచార్యుడు లాంటివారు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, మనకు దొరికిన పెద్ద నిధి. దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన విజయవంతమైన చిత్రాలను అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడిగా నిలిచారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో వస్తున్న ‘సింగ్ గీతం’ సినిమా ఇండియన్ సినిమాలో మరొక మైలురాయిగా నిలిచి, పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.

ఈ సినిమాను నిర్మించిన విధానాన్ని, వెనుక ఉన్న ఆలోచనను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. చిత్ర పరిశ్రమలోని పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని నేటి కొత్త తరానికి అందించాలనే గొప్ప ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత నాగ్ అశ్విన్‌ను చిరంజీవి ప్రత్యేకంగా కొనియాడారు. ఒకవైపు ఆనాటి తరానికి అద్భుత ప్రతినిధిగా నిలిచిన సింగీతం గారు, మరోవైపు ఈతరం సరికొత్త ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్.. వీరిద్దరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని మెగాస్టార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి తనకు ఎంతో ఇష్టమైన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందించడం సినిమాపై మరింత ఉత్సాహాన్ని, అంచనాలను పెంచిందని తెలిపారు. నాగ్ అశ్విన్ తో పాటు స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్ సంస్థలకు, చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com