రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం

- June 11, 2026 , by Maagulf
రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం

దుబాయ్: దుబాయ్‌లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన బాధితుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా.మేడిపల్లి సత్యం తెలిపారు.

మృతదేహాల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు దుబాయ్‌కు వెళ్లిన ఎమ్మెల్యే సత్యం గురువారం అక్కడి భారత కాన్సులేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మృతదేహాల స్వదేశానికి తరలింపు పై చర్చించారు.

మృతదేహాలను భారత్‌కు పంపించడంలో కొన్ని సాంకేతిక, పరిపాలనా ప్రక్రియలు ఉన్నాయని, వాటిని రెండు రోజుల్లో పూర్తి చేసి మృతదేహాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే వెల్లడించారు.

అనంతరం ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రషీద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామానికి చెందిన సయ్యద్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

గాయపడిన సయ్యద్ త్వరగా కోలుకుని స్వదేశానికి తిరిగి వచ్చేలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

దుబాయ్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com