సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- June 23, 2026
జూన్ 30 నుంచి అబుదాబి–ఫుజైరా మధ్య తొలి దశ ప్రారంభం
అబుదాబి: యూఏఈ జాతీయ రైల్వే ప్రాజెక్టులో కీలక ముందడుగుగా ఎతిహాద్ రైల్ ప్రయాణికుల రైలు సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తొలి దశలో జూన్ 30, 2026 నుంచి అబుదాబి–ఫుజైరా మధ్య ప్రయాణికుల రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో ప్రయాణ సమయం కేవలం 1 గంట 45 నిమిషాలు మాత్రమే ఉండనుంది.
అబుదాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీలో కొత్త ప్రయాణికుల రైల్వే స్టేషన్ను అబుదాబి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికుల రైల్వే నెట్వర్క్కు సంబంధించిన వివరాలను పరిశీలించి, స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలు, సమాచార నిర్వహణ వ్యవస్థలు, ఆపరేషనల్ సిద్ధతపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
మొదటి దశ విజయవంతంగా ప్రారంభమైన అనంతరం సెప్టెంబర్ 30, 2026 నుంచి దుబాయ్ మరియు అల్ ధైద్ స్టేషన్లను సేవల్లోకి తీసుకురానున్నారు. అనంతరం డిసెంబర్ 30, 2026 నుంచి అల్ ధఫ్రా ప్రాంత స్టేషన్లు ప్రారంభమవుతాయి. చివరి దశలో మార్చి 30, 2027 నాటికి ఈ రైల్వే మార్గం షార్జా వరకు విస్తరించనుంది.
జూన్ 23 నుంచి టికెట్ల విక్రయాలు
అబుదాబి–ఫుజైరా మార్గంలో కంఫర్ట్ క్లాస్ టికెట్ ధరలు Dh55 నుంచి, ప్రీమియం క్లాస్ టికెట్లు Dh120 నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కో రైలు సుమారు 400 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తం 13 రైళ్లతో ఈ సేవలు నిర్వహించనున్నారు.
ప్రయాణికులు జూన్ 23, 2026 నుంచి ఎతిహాద్ రైల్ అధికారిక వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా అనుసంధానానికి కీలక ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు యూఏఈలోని అన్ని ఎమిరేట్ల మధ్య రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలు, సరుకుల రవాణాను వేగవంతం చేయనుంది. పర్యాటకం, పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది కొత్త అవకాశాలను తెరుస్తుందని షేక్ ఖాలిద్ పేర్కొన్నారు.
2021లో ప్రకటించిన “ఫిఫ్టీ ప్రాజెక్ట్స్” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ప్రయాణికుల రైల్వే ప్రాజెక్టు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల నిర్మాణంలో యూఏఈ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై కీలక నిర్ణయం. 6 వరుసలకు విస్తరణ
- ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..1.75 లక్షల వీసాలు రద్దు
- భారతీయుడిని తరలించిన ఒమన్ రాయల్ ఎయిర్ఫోర్స్..!!
- సౌదీలో 27,360 షెవర్లే కార్ల రీకాల్.. ఎయిర్బ్యాగ్ లో లోపం..!!
- కొలంబియాను వణికించిన భూకంపం..132కి పెరిగిన మృతుల సంఖ్య
- కార్ల అద్దాలకు 50 శాతం వరకు టింట్ అనుమతించాలని ప్రతిపాదన..!!
- కువైట్లో ప్రవాసులకు కీలక హెచ్చరిక.. కమర్షియల్ కన్సీల్మెంట్పై కఠిన నిబంధనలు..!!
- ‘ఇన్స్టా పేరెంటింగ్’తో పిల్లలకు ముప్పు.. యూఏఈ వైద్యుల హెచ్చరిక..!!
- రాత్రివేళ లైట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తే QR10,000 వరకు జరిమానా..!!
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!







