ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

- June 23, 2026 , by Maagulf
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

న్యూ ఢిల్లీ: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు. ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కళలు, వైద్యం, క్రీడలు, సాహిత్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పురస్కారాలను అందుకున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు మమ్ముట్టికి కేంద్రం ‘పద్మభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. అదేవిధంగా క్యాన్సర్ నివారణ , వైద్య రంగంలో అంతర్జాతీయంగా ఎనలేని సేవలందించిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కూడా ‘పద్మభూషణ్’ అవార్డును స్వీకరించారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ వేడుకలో ప్రత్యేక గౌరవం దక్కింది. సుదీర్ఘ కాలంగా వెండితెరపై నటుడిగా, నిర్మాతగా సేవలందించిన మాజీ ఎంపీ మురళీమోహన్, అలాగే వైవిధ్యభరితమైన పాత్రలతో, హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్‌లు రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకున్నారు. వీరితో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటుడు ఆర్. మాధవన్‌ను కూడా కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది.

క్రీడా రంగానికి వస్తే, భారత క్రికెట్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించి, ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. సమాజ శ్రేయస్సు కోసం, దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తూ తమ తమ రంగాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వీరందరినీ గౌరవించడం ద్వారా పద్మ పురస్కారాల విశిష్టత మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు , ప్రముఖులు హాజరై అవార్డు గ్రహీతలను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com