తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’

- June 26, 2026 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నూతన సీఎస్ ఎంపికపై కసరత్తు చేసి, సంజయ్ జాజు వైపు మొగ్గు చూపింది.

1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు(Sanjay Jaju)కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ పనిచేసిన సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉంది. గతంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్‌గా, అలాగే సివిల్ సప్లైస్ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారు. ఐటీ రంగంలో ‘మీసేవ’ వంటి విప్లవాత్మకమైన పౌర సేవల వ్యవస్థ రూపకల్పనలో కూడా ఆయన పాత్ర ఎంతో కీలకం.

గత కొన్నేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో డెప్యుటేషన్‌పై ఉన్న ఆయన, కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ సంజయ్ జాజును తిరిగి సొంత కేడర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న రామకృష్ణారావు పదవీ విరమణ చేసిన వెంటనే సంజయ్ జాజు తెలంగాణ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com