వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- June 27, 2026
దుబాయ్: వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో వాహనదారులు తమ వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని దుబాయ్ పోలీసులు సూచించారు. ముఖ్యంగా టైర్లను తరచూ తనిఖీ చేయడంతో పాటు, వాహనాలు రోడ్లపై ప్రయాణించేందుకు తగిన స్థితిలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కాలంలో అనేక మంది సుదూర ప్రాంతాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించే నేపథ్యంలో ఈ సూచనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని పేర్కొన్నారు.
వాహన భద్రతపై అవగాహన పెంచడం, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించే సంస్కృతిని బలోపేతం చేయడం ద్వారా డ్రైవర్లు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని దుబాయ్ పోలీసులు తెలిపారు.
దుబాయ్ పోలీసుల ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ మాట్లాడుతూ, వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లోని అన్ని భద్రతా వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లకు సూచించారు.
అధికారిక అనుమతి లేని సంస్థల నుంచి వాహనాలకు బాహ్య మార్పులు లేదా అదనపు పరికరాలను అమర్చవద్దని ఆయన హెచ్చరించారు. ఇటువంటి అనధికారిక మార్పుల వల్ల తరచూ వాహనాలు చెడిపోవడమే కాకుండా, వాహనాల్లో అగ్నిప్రమాదాలకు కూడా అవి ప్రధాన కారణంగా మారుతున్నాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా పోలీసులు ప్రస్తుతం ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, తనిఖీలను ముమ్మరం చేశారని, ముఖ్యంగా గడువు ముగిసిన టైర్లతో నడుస్తున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ వెల్లడించారు.
ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో వాహన భద్రతకు సంబంధించిన 3,589 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైనట్లు ఆయన తెలిపారు. వీటిలో 1,737 కేసులు భద్రతా ప్రమాణాలు లేని వాహనాలను నడపడం, 1,026 కేసులు రోడ్డు ప్రయాణానికి అనర్హమైన వాహనాలను ఉపయోగించడం, 826 కేసులు గడువు ముగిసిన టైర్లతో వాహనాలు నడపడం కారణంగా నమోదైనట్లు వెల్లడించారు.
వాహనదారులు క్రమం తప్పకుండా వాహనాల నిర్వహణ చేపట్టడం, టైర్ల పరిస్థితిని పరిశీలించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని దుబాయ్ పోలీసులు మరోసారి సూచించారు.
తాజా వార్తలు
- డీప్ఫేక్లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్







