పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ ప్రారంభం

- July 05, 2026 , by Maagulf
పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ ప్రారంభం

అబుదాబి/దుబాయ్: యూఏఈలోని భారత రాయబార కార్యాలయం (అబుదాబి), భారత కాన్సులేట్ (దుబాయ్) పాస్‌పోర్ట్, వీసా, అట్టెస్టేషన్ సేవల కోసం ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించాయి. ప్రస్తుతం కాన్సులర్ సేవల నిర్వహణలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో భారతీయ ప్రవాసులకు సేవలను మరింత సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త సేవల సంస్థ నియామకం ఆలస్యం కావడంతో, జూలై 1 నుంచి భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ నేరుగా పరిమిత స్థాయిలో పాస్‌పోర్ట్, వీసా, అట్టెస్టేషన్ సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో రద్దీ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని http://book.passportindiauae.comవెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

అయితే, వాక్-ఇన్ సేవలు కూడా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అబుదాబి రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్‌లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వాక్-ఇన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. నవజాత శిశువుల పాస్‌పోర్ట్‌లు, అత్యవసర సర్టిఫికెట్లు వంటి అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

ముందస్తు అపాయింట్‌మెంట్ పొందిన వారు నిర్ణయించిన సమయానికి 15 నిమిషాల ముందే కార్యాలయానికి రావాలని సూచించారు. రద్దీ నివారించేందుకు దరఖాస్తుదారులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మైనర్ దరఖాస్తుదారుల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఇద్దరూ హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో కాన్సులర్ సేవల కోసం అల్ సఫరాత్ స్ట్రీట్‌లోని ప్రధాన గేట్ ద్వారా ప్రవేశం కల్పించగా, ఇతర సేవలు గార్డియన్ టవర్లోని కాన్సులర్ విభాగంలో అందుబాటులో ఉంటాయి. దుబాయ్ కాన్సులేట్‌లో పాస్‌పోర్ట్, వీసా సేవలకు గేట్ నంబర్–2, అట్టెస్టేషన్ సేవలకు గేట్ నంబర్–1 ద్వారా ప్రవేశం కల్పించారు.

దరఖాస్తుదారులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాలు, అవసరమైన అన్ని పత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. పాస్‌పోర్ట్ దరఖాస్తులను http://mportal.passportindia.gov.in/mission/ వెబ్‌సైట్‌లో నింపవచ్చని తెలిపారు. ఫోటోలు, సంతకాలు, ఇతర పత్రాలను నిర్దేశిత విధంగా అప్‌లోడ్ చేయాలని సూచించారు.

పాస్‌పోర్ట్, వీసా సేవలకు సంబంధించిన ఫీజులను నగదు రూపంలో మాత్రమే స్వీకరిస్తామని, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఫీజులను దరఖాస్తుదారులు గమనించాలని పేర్కొన్నారు.

సహాయం కోసం 800 46342 (800 INDIA) టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్, +971 54 309 0571 వాట్సాప్ నంబర్ లేదా [email protected] ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలని భారత మిషన్లు సూచించాయి.

ఈ పరిణామానికి కారణం, గతంలో కాన్సులర్ సేవలు అందించిన బీఎల్‌ఎస్ (BLS) సంస్థ ఒప్పందం ముగియడం, కొత్త సేవల సంస్థగా ఎంపికైన అల్‌హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సేవల ప్రారంభం ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతున్న న్యాయ వివాదం కారణంగా ఆలస్యం కావడమే. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత మిషన్లే నేరుగా సేవలు అందిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com