హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- July 05, 2026
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-1 టేకోవర్ (స్వాధీనం) ప్రక్రియను ముగించి, ఫేజ్-2 విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్కు ఆదివారం ఆయన ఒక అధికారిక లేఖ రాశారు. మెట్రో మొదటి దశ విలువను లెక్కించడంతో పాటు, రెండో దశకు సంబంధించిన ఆర్థిక నమూనాను పరిశీలించే బాధ్యతలను తక్షణమే ‘ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్’ (SBI CAPS)కు అప్పగించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
జాప్యం వల్ల పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయం
మెట్రో ఫేజ్-1 స్వాధీన ప్రక్రియ ఆలస్యం కావడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా ఈ ప్రక్రియ సాగుతుండటం వల్ల ప్రాజెక్టు రోజువారీ నిర్వహణలో సవాళ్లు, అనిశ్చితి ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. “ఈ ఆలస్యం కారణంగా ఫేజ్-2 డీపీఆర్ (DPR) ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ మందగిస్తోంది. కాలయాపన వల్ల భవిష్యత్తులో రెండో దశ నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది” అని సీఎం లేఖలో స్పష్టం చేశారు.
ఢిల్లీ సమావేశ నిర్ణయాలను గుర్తు చేసిన సీఎం
గత జూన్ 24న ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిల సమక్షంలో జరిగిన కీలక సమావేశాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెట్రో ఫేజ్-1 స్వాధీనం, అధిక వడ్డీ రుణాల రిఫైనాన్సింగ్, అలాగే ఫేజ్-2 విస్తరణకు ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను ‘ఎస్బీఐ క్యాప్స్’కు అప్పగించాలని ఆ రోజే ప్రాథమికంగా నిర్ణయించినట్లు గుర్తు చేశారు.
నోడల్ అధికారి నియామకం..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా లేఖ
ఢిల్లీ సమావేశం ముగిసి చాలా రోజులవుతున్నా, ఎస్బీఐ క్యాప్స్కు కేంద్రం నుంచి ఇంకా అధికారికంగా బాధ్యతలు బదిలీ కాలేదని, విధివిధానాలు కూడా ఖరారు కాలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించిందని తెలిపారు. ఢిల్లీ నిర్ణయాలను త్వరితగతిన అమలు చేసి మెట్రో ఫేజ్-2కు మార్గం సుగమం చేయాలని కోరారు.
ఇదే అంశం పై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కూడా సీఎం లేఖ రాశారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖతో మాట్లాడి ఈ ప్రక్రియ వేగవంతమయ్యేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







