షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..

- July 06, 2026 , by Maagulf
షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..

షార్జా: షార్జా పోలీసులు నకిలీ మొబైల్ యాప్‌ల ద్వారా ప్రజల డబ్బును దోచుకుంటున్న సైబర్ మోసం ముఠాను గుట్టుచప్పుడు కాకుండా పట్టుకున్నారు.ఈ కేసులో మొత్తం ఏడు మంది ఆసియా దేశాలకు చెందిన నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు.

పోలీసుల ప్రకారం, ఈ ముఠా ప్రభుత్వ అధికారులు లేదా అధికారిక సంస్థల ప్రతినిధులుగా నటిస్తూ బాధితులను మోసగించింది. వారికి నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించేలా ప్రలోభపెట్టి, ఆ యాప్‌ల ద్వారా ఫోన్లకు రిమోట్ యాక్సెస్ పొందినట్లు తెలిపారు.

ఈ సాంకేతిక దాడుల ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటాను సేకరించి, కార్మికుల వివరాలను ఉపయోగించి అక్రమంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా సైబర్ మోసాల ఆదాయాన్ని మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ అరెస్టులు యూఏఈలో సైబర్ నేరాల పై జరుగుతున్న కఠిన చర్యలలో భాగంగా జరిగాయి. ఇటీవల యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఆర్థిక రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న క్లిష్టమైన సైబర్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది.

ఆ కౌన్సిల్ ప్రకారం, ఫిషింగ్ దాడులు, మాల్వేర్ వ్యాప్తి, సెక్యూరిటీ లోపాలను ఉపయోగించడం వంటి పద్ధతులతో రోజుకు 8 లక్షలకు పైగా సైబర్ దాడుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఏఈ వేగవంతమైన డిజిటల్ అభివృద్ధి కారణంగా సైబర్ దాడులకు ప్రధాన లక్ష్యంగా మారుతోందని నిపుణులు హెచ్చరించారు.

అధికారులు అన్ని సంస్థలు జాతీయ సైబర్ భద్రతా నిబంధనలు పాటించాలని, తమ వ్యవస్థలను నిరంతరం అప్‌డేట్ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని సూచించారు.

యూఏఈ వద్ద బలమైన సైబర్ భద్రతా వ్యవస్థ ఉండటంతో, పెరుగుతున్న ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది. అలాగే ముందస్తు జాగ్రత్తలు, నిరంతర పర్యవేక్షణ, వేగవంతమైన స్పందన వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com