నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్

- July 08, 2026 , by Maagulf
నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
  • ప్రస్తుత విమానాశ్రయ ఆధునీకరణ, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు తొలి దశలో సుమారు రూ.300 కోట్ల పెట్టుబడి
  • మధ్య భారతదేశంలో అతిపెద్ద విమానయాన, కార్గో మరియు ఏరోసిటీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో వ్యూహాత్మక చేరిక

నాగ్‌పూర్/న్యూఢిల్లీ/హైదరాబాద్: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, నాగ్‌పూర్ కోసం ప్రతిష్ఠాత్మక బహుళ దశల ఆధునీకరణ మరియు విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ చర్యతో భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ విమానాశ్రయ మౌలిక సదుపాయాల సంస్థగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికకు మరింత బలం చేకూరింది.

నాగ్‌పూర్ విమానాశ్రయం ప్రైవేటీకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడం, 2026 జూన్ 25న సుమారు 1,000 హెక్టార్ల భూమిని ఎంఐఎల్ (MIL) అధికారికంగా అప్పగించడం, అలాగే కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ (COD) ప్రకటించడంతో ఈ ప్రకటన వెలువడింది. దీంతో జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GNIAL) విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించి, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి మార్గం సుగమమైంది.

నాగ్‌పూర్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయడం ద్వారా, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తన ఉనికిని గణనీయంగా విస్తరించుకుంది. అదే సమయంలో, ప్రయాణికులు, కార్గో మరియు వాణిజ్య వృద్ధికి అధిక అవకాశాలు ఉన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంస్థ వ్యూహానికి ఇది అనుగుణంగా ఉంది.

రాబోయే ఎనిమిదేళ్లలో అమలు చేయనున్న తొలి దశ అభివృద్ధి ప్రణాళికలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం, కార్యాచరణ సామర్థ్యాన్ని విస్తరించడం, విదర్భతో పాటు విస్తృత ప్రాంతానికి నాగ్‌పూర్‌ను ప్రముఖ విమానయాన మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సుమారు రూ.300 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రస్తుత విమానాశ్రయంలో తక్షణ అభివృద్ధి పనులను చేపట్టనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయ ఎకోసిస్టమ్‌లో కార్యాచరణలో అత్యుత్తమత, అత్యాధునిక సాంకేతికత, సుస్థిరత మరియు ప్రపంచ స్థాయి ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

దశలవారీగా అమలు చేయనున్న ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా, ప్రస్తుతం సంవత్సరానికి 30 లక్షల (3 మిలియన్) ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని, 30 సంవత్సరాల కన్సెషన్ కాలంలో సంవత్సరానికి 3 కోట్ల (30 మిలియన్) ప్రయాణికుల వరకు పెంచనున్నారు. అంతేకాకుండా, కేటాయించిన భూభాగంలో భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని సంవత్సరానికి 5 కోట్ల (50 మిలియన్) ప్రయాణికుల వరకు విస్తరించే అవకాశం కూడా ఉంది.

భారతదేశ భౌగోళిక కేంద్రంగా ఉన్న నాగ్‌పూర్ వ్యూహాత్మక స్థానంతో పాటు, విస్తృత ఎంఐహెచ్‌ఏఎన్ (MIHAN) ఎకోసిస్టమ్‌ను ఉపయోగించుకొని, ఈ విమానాశ్రయాన్ని ప్రధాన కార్గో మరియు లాజిస్టిక్స్ హబ్‌గా కూడా అభివృద్ధి చేయనున్నారు. దీర్ఘకాలికంగా ఏడాదికి 1,50,000 మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించారు.

జీఎన్ఐఏఎల్‌కు అప్పగించిన 1,000 హెక్టార్ల భూమిలో, సుమారు 100 హెక్టార్లను సిటీ-సైడ్ అభివృద్ధి లేదా ఏరోసిటీ కోసం కేటాయించారు. దీని ద్వారా వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు మరియు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

ఈ సందర్భంగా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీ.బీ.ఎస్.రాజు మాట్లాడుతూ, “జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో విమానాశ్రయాలు కేవలం రవాణా మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని, అవి ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి మరియు సామాజిక పురోగతికి శక్తివంతమైన వేదికలని మేము విశ్వసిస్తున్నాము. నాగ్‌పూర్ విమానాశ్రయం రూపాంతరం, అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి అర్థవంతంగా దోహదపడే ప్రపంచ స్థాయి విమానయాన ఎకోసిస్టమ్‌లను నిర్మించాలనే మా దీర్ఘకాలిక దృష్టికి నిదర్శనం. దేశం మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, దేశ నిర్మాణానికి చోదకశక్తిగా నిలిచే, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విమానాశ్రయాలను నిర్మించడంతో పాటు, ప్రయాణికులు మరియు స్థానిక సమాజాలకు అత్యుత్తమ అనుభవాలను అందించాలనే మా నిబద్ధత కొనసాగుతుంది” అని తెలిపారు.

జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్.జీ.కే. కిషోర్ మాట్లాడుతూ, “నాగ్‌పూర్ విమానాశ్రయాన్ని అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన సుస్థిర విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే మా దృష్టి. ఈ విస్తరణ మరింత స్మార్ట్, అంతరాయం లేని మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంతో పాటు, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించి, భవిష్యత్తుకు అనువైన బలమైన మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా ఒక కీలక ముందడుగు అవుతుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో, పురోగతి మరియు సుస్థిరతకు తోడ్పడే ప్రపంచ స్థాయి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే మా నిబద్ధత కొనసాగుతుంది. అలాగే, అన్ని భాగస్వాములతో కలిసి మరింత హరిత, సమ్మిళిత భవిష్యత్తును నిర్మించేందుకు కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

నాగ్‌పూర్ విమానాశ్రయం సీఈఓ శ్రీకాంత్ భండార్కర్ మాట్లాడుతూ, “ఈ విస్తరణ కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాదు – ఇది విమానాశ్రయ ప్రయాణ అనుభవంలో సమగ్ర రూపాంతరం. ప్రతి ప్రయాణికుడికి సమర్థవంతమైన, సౌకర్యవంతమైన మరియు సుఖవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించే, అదే సమయంలో నాగ్‌పూర్ అభివృద్ధి గాథకు తోడ్పడే భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ప్రవేశ ద్వారాన్ని (గేట్‌వే) నిర్మించడమే మా లక్ష్యం. ప్రయాణికులు, భాగస్వాములు మరియు ఇతర సంబంధిత వర్గాల అంచనాలను చేరుకోవడమే కాకుండా వాటిని అధిగమించే ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము” అని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com