దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం

- July 09, 2026 , by Maagulf
దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం

భారతదేశపు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ అయిన ‘ఛాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’, అంతర్జాతీయ మార్కెట్లో తన ఉనికిని చాటుకుంటూ దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ ఆర్థిక దిగ్గజం ‘ఎన్.హెచ్ ఇన్వెస్ట్‌మెంట్ & సెక్యూరిటీస్’ (NHIS) తో ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఛాయిస్ గ్రూప్‌నకు చెందిన బ్రోకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగమైన ‘ఛాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ (CEBPL) లో NHIS రూ. 9,000 మిలియన్ల (రూ. 900 కోట్లు) భారీ పెట్టుబడిని పెట్టనుంది. కంపల్సరీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ (CCPS) రూపంలో అందనున్న ఈ నిధులను మార్జిన్ ట్రేడ్ ఫండింగ్ (MTF) బుక్ వృద్ధితో పాటు అధునాతన సాంకేతికత, నూతన కస్టమర్ల చేరిక, సరికొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ మరియు వ్యాపార విస్తరణ కోసం వృద్ధి మూలధనంగా వినియోగించనున్నారు. దేశీయ మూలధన మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం, డిజిటల్ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో ఈ నిధుల సమీకరణ ఛాయిస్ సంస్థకు పెద్ద మైలురాయిగా నిలవనుంది.

రాబోయే మూడేళ్లలో 5 రెట్ల వృద్ధి లక్ష్యం.. గ్లోబల్ నైపుణ్యాల మార్పిడి
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భారతీయ మార్కెట్‌లో ఛాయిస్ సంస్థకున్న బలమైన క్షేత్రస్థాయి పట్టుకు, ఆసియాలోనే అత్యంత అధునాతన మార్కెట్లలో ఒకటైన దక్షిణ కొరియా సంస్థ యొక్క అంతర్జాతీయ సాంకేతిక ఆపరేటింగ్ నైపుణ్యం తోడవనుంది. సంస్థాగత బ్రోకింగ్, రీసెర్చ్, క్యాపిటల్ మార్కెట్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఇరు సంస్థల మధ్య విజ్ఞాన మార్పిడి జరగనుండటంతో రాబోయే మూడేళ్లలో తమ బ్రోకింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాల్లో 5 రెట్ల వృద్ధిని సాధించాలని CEBPL లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిణామంపై ఛాయిస్ ఇంటర్నేషనల్ సీఈఓ అరుణ్ పొద్దార్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 దిశగా నాణ్యమైన ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకోవడానికి మరియు భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఇదొక సువర్ణావకాశమని NHIS ప్రెసిడెంట్ అండ్ సీఈఓ షిన్ జే వూక్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com