ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్

- July 09, 2026 , by Maagulf
ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్

కువైట్ సిటీ: ఇరాన్ కువైట్‌ పై డ్రోన్లు, క్షిపణులతో దాడి యత్నం చేసిన కొద్ది గంటలకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గురువారం కువైట్‌కు చేరుకున్నారు. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఇరాన్ గురువారం కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించడంతో ఆయా దేశాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ప్రయోగించిన ఆయుధాల్లో చాలా వరకు గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు సమాచారం.

ఈ దాడులు అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్ సైనిక స్థావరాలపై నిర్వహించిన దాడులకు ప్రతిస్పందనగా జరిగినట్లు భావిస్తున్నారు. అమెరికా దాడుల్లో ప్రధానంగా దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కువైట్ సాయుధ దళాల ప్రకటన ప్రకారం, దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు డ్రోన్లు, క్షిపణుల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని అప్రమత్తంగా వ్యవహరించాయి.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ వెంట ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి మరియు అధ్యక్ష కార్యాలయ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్, ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్, అధ్యక్ష కార్యాలయ ప్రత్యేక వ్యవహారాల ఉపాధ్యక్షుడు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్, అధ్యక్షుడి సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్‌తో పాటు పలువురు సీనియర్ షేక్‌లు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారగా, ప్రాంతీయ నాయకుల మధ్య దౌత్య చర్చలకు ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com