అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు

- July 09, 2026 , by Maagulf
అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు

దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన డబుల్‌డెక్కర్ విమానం ఎయిర్‌బస్ ఏ380ను అక్టోబర్ 25 నుంచి దుబాయ్–ఢిల్లీ మార్గంలో ప్రవేశపెడుతున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రకటించింది. దీంతో ముంబై, బెంగళూరు తర్వాత ఎమిరేట్స్ ఏ380 సేవలు అందుకునే భారతదేశంలోని మూడో నగరంగా ఢిల్లీ నిలవనుంది.

ఢిల్లీకి రోజువారీ నాలుగు విమాన సర్వీసుల్లో ఒకదానిపై నాలుగు తరగతుల (ఫోర్-క్లాస్) సదుపాయాలతో కూడిన ఎయిర్‌బస్ ఏ380 విమానం నడపనున్నారు. ఇందులో అత్యాధునిక ప్రీమియం ఎకానమీ క్లాస్ కూడా అందుబాటులో ఉంటుంది. మిగిలిన మూడు రోజువారీ సర్వీసులను నూతనీకరించిన నాలుగు తరగతుల బోయింగ్ 777 విమానాలతో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఎమిరేట్స్ డిప్యూటీ ప్రెసిడెంట్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజిమ్ మాట్లాడుతూ, భారత్‌కు పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి ఏ380 సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. భారత మార్కెట్‌తో ఎమిరేట్స్‌కు ఉన్న బలమైన భాగస్వామ్యానికి ఇది మరో నిదర్శనమని పేర్కొన్నారు.

అలాగే, అక్టోబర్ చివరి నాటికి భారత్‌లోని ఆరు నగరాలకు ప్రీమియం ఎకానమీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, కొచ్చి నగరాలకు ప్రయాణించే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు.

అక్టోబర్ చివరి నాటికి భారత్‌కు నిర్వహించే ఎమిరేట్స్ వారాంతపు విమాన సర్వీసుల్లో దాదాపు సగం వరకు ప్రీమియం ఎకానమీ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు అదనపు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com