యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!

- July 10, 2026 , by Maagulf
యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!

దుబాయ్:  జులైలో భారత్‌కు వెళ్లాలని భావిస్తున్న యూఏఈ ప్రవాసులకు శుభవార్త. యూఏఈ నుంచి భారత్‌కు వెళ్లే విమానాల రిటర్న్ టికెట్ల ధరలు ఇటీవల ధరలతో పోలిస్తే 20 నుంచి 30 శాతం వరకు తగ్గినట్లు ట్రావెల్ ఏజెంట్లు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు వందల దిర్హామ్‌లు ఆదా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ భారత నగరాలకు రిటర్న్ టికెట్లు Dh1,000 కాస్త ఎక్కువ ధర నుంచే లభిస్తున్నాయి. అయితే దక్షిణ భారత నగరాలకు మాత్రం టికెట్ ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ఈ తగ్గిన ధరలు జులైలో కొద్ది రోజుల పాటు మాత్రమే కొనసాగే అవకాశం ఉందని, ఆగస్టు నుంచి మళ్లీ చార్జీలు పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

మంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు కూడా టికెట్ ధరలు సుమారు 20 శాతం తగ్గాయని మంగళూరుకు చెందిన సిద్దిఖ్ ట్రావెల్స్ యజమాని తాహా సిద్దిఖీ తెలిపారు. ప్రస్తుతం దుబాయ్‌తో పోలిస్తే అబుదాబి నుంచి బయలుదేరే విమానాల్లో టికెట్లు మరింత తక్కువగా ఉన్నాయని చెప్పారు. అయితే ఆగస్టులో ప్రయాణించేవారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ఉత్తర, పశ్చిమ భారత నగరాలకు తక్కువ ధరలు కనిపిస్తున్నాయని వైజ్‌ఫాక్స్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజర్ సుబైర్ థెకేపురత్‌ వలప్పిల్ తెలిపారు.  ముంబై, పుణె నగరాలకు కూడా టికెట్లు కేరళలోని కొచ్చి, తిరువనంతపురం, కొజికోడ్ వంటి నగరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని తెలిపారు. జులైలో 7 నుంచి 10 రోజుల ప్రయాణానికి రిటర్న్ టికెట్లు Dh1,080 నుంచి లభిస్తున్నాయని చెప్పారు.

జులై 21 నుంచి 31 వరకు ప్రయాణానికి అందుబాటులో ఉన్న కనిష్ఠ రిటర్న్ చార్జీలు: 

* అహ్మదాబాద్ – Dh1,029

* న్యూఢిల్లీ – Dh1,041

* ముంబై – Dh1,074

* పుణె – Dh1,114

* బెంగళూరు – Dh1,389

* కొజికోడ్– Dh1,578

* మంగళూరు – Dh1,928

ప్రస్తుతం పశ్చిమ భారత నగరాలకు వెళ్లే ప్రయాణికులు అత్యంత తక్కువ ధరల్లో టికెట్లు పొందుతున్నారు. కేరళ, తీర కర్ణాటక ప్రాంతాలకు టికెట్ ధరలు తగ్గినా, ఇతర నగరాలతో పోలిస్తే ఇంకా కొన్ని వందల దిర్హామ్‌లు ఎక్కువగానే ఉన్నాయి.

ట్రావెల్ ఏజెంట్ల ప్రకారం..  వేసవి సెలవుల ప్రారంభ రద్దీ ముగియడంతో ప్రస్తుతం డిమాండ్ కొంత తగ్గింది. అయితే పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడానికి ముందు ఆగస్టులో కుటుంబాల ప్రయాణాలు పెరగనున్నందున, భారత్‌కు వెళ్లే విమానాల టికెట్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com