ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- July 14, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. ప్రధానంగా తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రహదారి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వేగంగా అనుమతులు తీసుకొచ్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక హైవే ప్రాజెక్టులపై చర్చించారు.
ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ 95 శాతం ఇప్పటికే పూర్తయిందని రేవంత్ రెడ్డి గడ్కారికి వివరించారు.
ఉత్తర, దక్షిణ భాగాల పనులను ఒకేసారి ప్రారంభించడం ద్వారా సమయంతోపాటు ఖర్చు కూడా ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులను కూడా త్వరగా మంజూరు చేయాలని ఈ సందర్భంగా గడ్కరీని కోరారు.
100 కిలోమీటర్లు తగ్గనున్న ప్రయాణం :
హైదరాబాద్ నగరాన్ని అమరావతి, బందర్ పోర్టుతో లింక్ చేసే ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవేపై కూడా సీఎం ప్రస్తావించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు నిర్మించనున్న 12 లేన్ల రహదారి పూర్తయితే హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణ దూరం దాదాపు 100 కిలోమీటర్లు తగ్గనుందని సీఎం రేవంత్ తెలిపారు.
అదేవిధంగా, మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. శ్రీశైలం ఆలయం, నల్లమల అడవులు, జలాశయాలను కలిపే ఈ ప్రాజెక్టుకు పెండింగ్లో ఉన్న అటవీ అనుమతులను సైతం మంజూరు చేయాలని కోరారు.
మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు రాజీవ్ హైవేకు ప్రత్యామ్నాయంగా 6 లేన్ల రహదారి అవసరాన్ని కూడా సీఎం గడ్కారికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కూడా హామీ ఇచ్చారు.
తెలంగాణ రహదారి, మౌలిక సదుపాయాలకు కొత్త దిశ చూపేలా రాష్ట్ర ప్రయోజనాలపై కూడా సీఎం రేవంత్ మాట్లాడినట్టు తెలుస్తోంది. రోడ్ల విస్తరణతో ప్రయాణ సౌకర్యాలే కాకుండా పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయ రంగాలకు కొత్త అవకాశాలు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్&బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు, ప్రత్యేక కార్యదర్శి (సమన్వయ) అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







