ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!

- July 14, 2026 , by Maagulf
ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!

అబుదాబి: చట్టబద్ధ అనుమతి లేకుండా ప్రైవేట్ కారుకు ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం వాడిన కేసులో ఇద్దరు వ్యక్తులకు అబుదాబి క్రిమినల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నిందితుల్లో ఒకరికి అదనంగా Dh100,000 జరిమానా కూడా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ లైట్లు అమర్చిన కారును, అలాగే అందులో ఉన్న అత్యవసర హెచ్చరిక పరికరాలను అధికారులు సీజ్ చేశారు.

అబుదాబి న్యాయ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలి నిందితుడు అనుమతి లేకుండా ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం అమర్చిన వాహనాన్ని పబ్లిక్ రోడ్ పై నడిపినందుకు ఆరు నెలల జైలు శిక్షకు గురయ్యాడు. వాహనాన్ని కూడా జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

ఇక రెండో నిందితుడు భద్రతా పరికరాల వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీ మేనేజర్. అవసరమైన అధికారిక అనుమతులు లేకుండా ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టంను సరఫరా చేసి, వాహనంలో అమర్చినందుకు అతనికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు Dh100,000 జరిమానా విధించారు. ఈ పరికరాలకు సంబంధించిన కంపెనీ స్టాక్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది.

భద్రతా నిఘా వ్యవస్థలు పబ్లిక్ రహదారిపై అత్యవసర వాహనాలకు మాత్రమే కేటాయించిన హెచ్చరిక లైట్లతో ప్రయాణిస్తున్న కారును గుర్తించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ నిఘా వ్యవస్థలు, భద్రతా నివేదికల ఆధారంగా వాహనాన్ని గుర్తించిన అధికారులు, డ్రైవర్‌కు ఆ పరికరాలు వినియోగించే చట్టబద్ధ అనుమతి లేదని తేల్చారు. తదుపరి దర్యాప్తులో ఆ పరికరాలను సరఫరా చేసి అమర్చిన సంస్థను గుర్తించారు. కంపెనీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని, ఇద్దరు నిందితులను అబుదాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.

ఈ సందర్భంగా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ప్రజలకు సూచించారు. అలాగే ప్రైవేట్ వాహనాలకు అత్యవసర హెచ్చరిక లైట్లు లేదా సైరన్ వ్యవస్థలను విక్రయించడం, సరఫరా చేయడం లేదా అమర్చడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వ్యాపార సంస్థలను హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com