లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- July 16, 2026
చెన్నై: తమిళనాడులో అవినీతి, లంచగొండితనం, అధికార దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ స్పష్టం చేశారు. కరూర్ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అవినీతికి పాల్పడేవారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజలు తన వెంట ఉన్నంత కాలం రాష్ట్రంలో అవినీతిపరుల ఆటలు సాగవన్నారు. తాను కూడా సామాన్య కుటుంబం నుంచే వచ్చానని, పేదరికం, ఆకలి అంటే ఏంటో తనకు తెలుసని.. ప్రజల సొమ్మును తాను తాకనని, తన చుట్టూ ఉన్నవారిని కూడా తాకనివ్వనని విజయ్ స్పష్టం చేశారు.
‘లంచం అడిగితే మా విజయ్ ప్రభుత్వం అని చెప్పండి’
కరూర్ సభలో సీఎం విజయ్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ఎవరైనా లంచం అడిగితే నేరుగా ‘మేము ఇవ్వం’ అని ధైర్యంగా చెప్పండి. ఆ తర్వాత కూడా బలవంతం చేస్తే.. ‘ఈ రాష్ట్రాన్ని పాలిస్తోంది మా విజయ్!’ అని గట్టిగా చెప్పండి. నేను మీకు అండగా ఉంటాను అని ధైర్యం చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో కరూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటన తర్వాత విజయ్ ఈ జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నాటి విషాదాన్ని గుర్తు చేసుకుంటూ.. అది తన గుండెల్లో ఎప్పటికీ మానిపోని గాయమని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ఘటనలో మృతుల కుటుంబాలకు చెందిన 31 మందికి విజయ్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అలాగే బాధితుల జ్ఞాపకార్థం కరూర్లో స్మారక చిహ్నం నిర్మిస్తామని అధికారికంగా ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకున్న అనంతరం, కరూర్ సమీపంలోని మనవాసి వద్ద రూ.1,700 కోట్లతో ఏర్పాటు కానున్న ‘ఎవర్వాన్ కొఠారి ఫుట్వేర్’ పరిశ్రమకు సీఎం విజయ్ శంకుస్థాపన చేశారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
టీవీకేలోనే అవినీతి ఉందంటూ ఆరోపణలు.. డీఎంకే
విజయ్ చేసిన అవినీతి నిర్మూలన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీ డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత టి.కె.ఎస్. ఇలంగోవన్ మాట్లాడుతూ.. విజయ్ పార్టీలోనే అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. టీవీకే (TVK) లీగల్ సెల్ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. అదే పార్టీకి చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఇలంగోవన్ ఈ సందర్భంగా మీడియా ముందు ప్రస్తావించారు.
తాజా వార్తలు
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!







