సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!

- July 16, 2026 , by Maagulf
సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!

సలాలా: ఒమన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌లో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అవకాశాలను పెంచేందుకు మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ను ప్రారంభించారు. "రెస్ట్ అష్యూర్డ్ విత్ ఎర్లీ స్క్రీనింగ్" అనే నినాదంతో సలాలాలోని అల్ సాదా హెల్త్ సెంటర్ లో ఈ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను మహిళలకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ధోఫార్ గవర్నరేట్‌లోని వివిధ విలాయత్‌లలో ఈ మొబైల్ యూనిట్ సేవలు అందించనుంది.

ధోఫార్‌లోని ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ శాఖ తాత్కాలిక చైర్మన్ జైన్ అల్ అబిదీన్ అలీ అల్ అజీలీ మాట్లాడుతూ..  ఖరీఫ్ (వర్షాకాల) సీజన్‌లో ప్రతి ఏడాది ఈ మొబైల్ యూనిట్‌ను ధోఫార్‌కు తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ యూనిట్‌లో మామోగ్రామ్ యంత్రం ఏర్పాటు చేసినట్లు, 40 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ సేవలు పౌరులు, ప్రవాసులు, పర్యాటకులు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది మిర్బాత్ విలాయత్‌లో రెండు వారాల పాటు సేవలు అందించిన యూనిట్ ప్రస్తుతం ఆగస్టు 28 వరకు సలాలాలోని అల్ సాదా హెల్త్ సెంటర్‌లో కొనసాగుతుందని పేర్కొన్నారు.

అలాగే, 2025లో 40 ఏళ్లు పైబడిన 413 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, 40 ఏళ్లలోపు 371 మందికి వైద్య సలహాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. మొత్తం 784 మంది ఈ సేవల ద్వారా లబ్ధి పొందినట్లు తెలిపారు. ఈ మొబైల్ స్క్రీనింగ్ యూనిట్ 2010 నుంచి ప్రతి ఏడాది ధోఫార్‌ను సందర్శిస్తూ నిరంతరంగా సేవలు అందిస్తోందని, ఈ కార్యక్రమానికి ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ తో పాటు పెట్రోలియం డెవలప్‌మెంట్ ఒమన్ (PDO) అందిస్తున్న సహకారం అభినందనీయమని అజీలీ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com