నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- July 16, 2026
దుబాయ్: యూఏఈలో సమ్మర్ సెలవుల నేపథ్యంలో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు. నకిలీ హాలిడే హోమ్లు, చౌక ట్రావెల్ ప్యాకేజీలు, వాహన బీమా ఆఫర్లు, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఫిషింగ్ మోసాల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం.. దేశంలో నమోదవుతున్న సైబర్ ఉల్లంఘనల్లో 75 శాతానికి పైగా ఫిషింగ్ ఈమెయిల్స్, నకిలీ మెసేజుల ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సుమారు 3.4 బిలియన్ ఫిషింగ్ మెసేజులు పంపుతున్నట్లు తెలిపింది. అలాగే, ప్రస్తుతం 90 శాతానికి పైగా డిజిటల్ మోసాలు AI ఆధారిత ఫిషింగ్ ద్వారానే జరుగుతున్నాయని హెచ్చరించింది.
గ్లోబల్ యాంటీ-స్కామ్ అలయన్స్ (GASA), బయోక్యాచ్ నివేదికల ప్రకారం.. గత ఏడాది యూఏఈలో 40 వేల మందికిపైగా మోసాలకు గురయ్యారు. ఒక్కో వ్యక్తి సగటున 2,100 డాలర్లకు పైగా కోల్పోయారు.
సమ్మర్ లో ఎక్కువగా జరుగుతున్న మోసాలు
నకిలీ హాలిడే హోమ్లు, చాలెట్ బుకింగ్లు:
సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు చూపించి అడ్వాన్స్, రిఫండబుల్ డిపాజిట్ పేరుతో డబ్బు వసూలు చేసి మోసగాళ్లు పరారవుతున్నారు. ఇటీవల దుబాయ్లో ఓ వ్యక్తి ఇలాంటి మోసంలో చిక్కుకొని 8,000 దిర్హమ్లు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
నకిలీ వాహన బీమా ఆఫర్లు:
అసాధారణంగా తక్కువ ధరలకు కార్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి ముందుగానే డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నకిలీ సంస్థలపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరిక జారీ చేసింది.
OTPలు, నకిలీ యాప్ల ద్వారా మోసాలు:
బ్యాంకు అధికారులు లేదా ప్రభుత్వ ప్రతినిధులమని చెప్పి OTPలు, UAE Pass కోడ్లు, పాస్వర్డ్లు అడగడం, రిమోట్ యాక్సెస్ యాప్లు డౌన్లోడ్ చేయించడం ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని దుబాయ్, అబుదాబి పోలీసులు హెచ్చరించారు.
సమ్మర్ లోనే సైబర్ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి?
సమ్మర్ లో సైబర్ మోసాలు పెరగడానికి ప్రధాన కారణం ప్రజల రోజువారీ అలవాట్లలో వచ్చే మార్పులేనని తమయౌజ్ బిజినెస్ సొల్యూషన్స్ మేనేజింగ్ పార్టనర్, ఏఐ నిపుణురాలు అలీనా టిమోఫీవా తెలిపారు. ముఖ్యంగా సమ్మర్ లో ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఆన్లైన్ షాపింగ్ పెరగడం, సెలవుల కోసం బుకింగ్లు చేసుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉంటారని చెప్పారు. ఈ సమయంలో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా ఉండటాన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 10.5 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఏఐ కారణంగా నేరగాళ్లకు మోసాలు చేయడం మరింత సులభమైందని, అత్యంత నమ్మకంగా కనిపించే ఈమెయిల్లు, నకిలీ వెబ్సైట్లు, వాయిస్ క్లోన్ చేయడం, డీప్ఫేక్ వీడియోలు తయారు చేయడం, విశ్వసనీయ సంస్థల పేరుతో సులభంగా మోసాలకు పాల్పడడం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో, కేవలం నిమిషాల్లో సాధ్యమవుతోందని ఆమె హెచ్చరించారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఫోన్ కాల్, వీడియో లేదా మెసేజులను వెంటనే నమ్మకుండా.. సొంతంగా ధృవీకరించాలి.
* OTPలు, UAE Pass కోడ్లు, ATM PINలు, CVV నంబర్లు, పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు.
* హాలిడే బుకింగ్లు, బీమా సేవలు, వీసా సేవలు అధికారిక, లైసెన్స్ పొందిన సంస్థల ద్వారానే పొందాలి.
* వాట్సాప్లో వచ్చే ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్ను ఎవరితోనూ పంచుకోవద్దు. టూ-స్టెప్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా ప్రారంభించాలి.
* మొబైల్ ఫోన్, బ్యాంకు కార్డులను ఒకే చోట ఉంచకుండా జాగ్రత్త పడాలి.
మోసపోయినట్లు అనుమానం వచ్చిన వెంటనే బ్యాంకును సంప్రదించి ఖాతాను భద్రపరచాలని, అలాగే దుబాయ్ పోలీసుల eCrime ప్లాట్ఫారమ్ ద్వారా లేదా అత్యవసరం కాని సహాయం కోసం 901 నంబర్కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







