ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు

- July 19, 2026 , by Maagulf
ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు

అబుదాబి: మిడిల్ ఈస్ట్ లో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల పై యూఏఈ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా వెంటనే శత్రుత్వ చర్యలను నిలిపివేసి, శాంతి చర్చలను పునఃప్రారంభించాలని యూఏఈ పిలుపునిచ్చింది.

ఈ మేరకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, అన్ని పక్షాలు అత్యంత సంయమనం పాటించాలని, పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యూఏఈ కోరింది. ప్రాంతం మరింత అస్థిరత, హింస వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొంది.

అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానం ఎలాంటి అంతరాయం లేకుండా సురక్షితంగా కొనసాగడం అత్యంత ముఖ్యమని యూఏఈ స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్ జలసంధి కీలక మార్గమని పేర్కొంటూ, అక్కడ నౌకాయాన భద్రతను అన్ని దేశాలు పరిరక్షించాలని సూచించింది.

అలాగే ప్రాంతంలోని పౌర మౌలిక సదుపాయాలు, ప్రజలకు సేవలు అందించే సంస్థలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, డీసాలినేషన్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలు, రవాణా కేంద్రాలు, నివాస ప్రాంతాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలు, మానవతా సూత్రాలకు తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొంది.

ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని స్పష్టం చేసిన యూఏఈ, ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు దౌత్యపరమైన చర్చలే ఏకైక మార్గమని పునరుద్ఘాటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com