ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!

- July 20, 2026 , by Maagulf
ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!

మస్కట్: ఒమన్‌లో మరోసారి తీవ్ర ఎండల ప్రభావం కనిపించనుంది. రానున్న రోజుల్లో తీర ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని దేశ పౌర విమానయాన సంస్థ (CAA) హెచ్చరించింది.  CAAకు చెందిన జాతీయ విపత్తుల ముందస్తు హెచ్చరిక కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..జూలై 19 నుంచి 21 వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి తీవ్ర వేడి పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. తీవ్ర ఎండల కారణంగా డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా వైద్యుల పలు సూచనలు చేశారు.
* మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దు.
* దాహం లేకపోయినా తరచూ నీరు తాగాలి.
* లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
* ఎండలో ఎక్కువసేపు పని చేయవద్దు.
* కాఫీ, కూల్ డ్రింక్స్ కంటే నీరు, పుచ్చకాయ, కమలాపండు, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
* పిల్లలు లేదా పెంపుడు జంతువులను పార్క్ చేసిన వాహనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలివేయకూడదు.

తల తిరగడం, తీవ్ర తలనొప్పి, అయోమయం, వాంతులు, కండరాల నొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచించారు. ప్రజలు తాజా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com