నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- September 04, 2026కాఠ్మాండు: వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు యూఏఈ నుంచి మూడో సహాయక విమానం చేరుకుంది. సహాయక సామగ్రితో పాటు ప్రత్యేక సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాన్ని ఈ విమానం కాఠ్మాండుకు తీసుకొచ్చింది. వరదలు, కొండచరియల ఘటనల్లో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడి, కొందరు గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.
విమానానికి నేపాల్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మంత్రి డాక్టర్ మహాబీర్ పున్, నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రామ్ కాజీ ఖడ్కా, నేపాల్లో యూఏఈ రాయబారి అబ్దుల్లా అల్ షమ్సీ, యూఏఈ ఎయిడ్ ఏజెన్సీ వైస్ చైర్మన్ కార్యాలయ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ మన్సూరి స్వాగతం పలికారు.
నేపాల్లో వరద బాధితులకు సహాయం అందించేందుకు 10 మిలియన్ అమెరికన్ డాలర్లు కేటాయించాలన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అబ్దుల్లా అల్ షమ్సీ తెలిపారు.
ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడం, నేపాల్ అధికారులతో సమన్వయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లకు మద్దతు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే అత్యవసర వైద్య సహాయం, వివిధ వయసుల ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ ఐక్యత, సహకారం, మానవతా చర్యలకు యూఏఈ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ప్రకృతి విపత్తులు, సంక్షోభాల సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలవడం యూఏఈ మానవతా విధానంలో భాగమని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 148 టన్నుల సహాయం
మూడో సహాయక విమానంలో ప్రత్యేక సెర్చ్ అండ్ రెస్క్యూ బృందంతో పాటు 20 టన్నుల సహాయక సామగ్రి ఉందని డాక్టర్ అహ్మద్ అల్ మన్సూరి తెలిపారు. దీంతో నేపాల్కు యూఏఈ అందించిన మొత్తం సహాయక సామగ్రి 148 టన్నులకు చేరిందని వెల్లడించారు.
నేపాల్లో వరదలు, కొండచరియల కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఈ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన సామగ్రిని అందించడంతో పాటు పునరావాస, పునరుద్ధరణ చర్యలకు మద్దతు ఇవ్వడం లక్ష్యమన్నారు.
దుబాయ్ పోలీసుల ప్రత్యేక రెస్క్యూ బృందం
మూడో సహాయక విమానం ప్రత్యేకతగా దుబాయ్ పోలీసులకు చెందిన శిక్షణ పొందిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం నేపాల్కు చేరుకుందని యూఏఈ రిలీఫ్ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ హమ్మూద్ అల్ అఫారీ తెలిపారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక పరికరాలతో కూడిన ఈ బృందం ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, రక్షణ చర్యలకు సహకరించనుంది.
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సహాయం అందించేందుకు స్థానిక మార్కెట్ల నుంచి కూడా అవసరమైన వస్తువులను సమీకరించే చర్యలు కొనసాగుతున్నాయని అల్ అఫారీ తెలిపారు. దీని ద్వారా బాధితులకు సహాయక సామగ్రిని సాధ్యమైనంత త్వరగా చేరవేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







