ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- July 20, 2026
హైదరాబాద్: నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షల నిర్వహణలో వెలుగుచూసిన అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై లాఠీలు ఝుళిపించడం, బాష్పవాయువు (టియర్ గ్యాస్) ప్రయోగించడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ఈ పోరాటంలో నష్టపోయిన విద్యార్థులందరికీ తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
విద్యార్థులపై దాడి.. కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలోని అధికార పీఠంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పరీక్షల లీకేజీలతో లక్షలాది మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తమ తప్పులను ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. నిరసనకారులపై పడిన ప్రతి దెబ్బ.. నిజమన్నా, ప్రశ్నలన్నా బీజేపీకి ఎంత భయమో తెలియజేస్తోందని, నీట్ కుంభకోణంపై కేంద్రం సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ముట్టడికి యత్నం..ఢిల్లీలో ఉద్రిక్తత
మరోవైపు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజైన సోమవారం నాడు.. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘ఛలో పార్లమెంట్’ ముట్టడి కార్యక్రమం దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో తక్షణమే మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భారీ ర్యాలీగా పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు.
లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం.. పలువురికి గాయాలు
అయితే, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో నిరసనలకు అనుమతి లేదంటూ భద్రతా బలగాలు విద్యార్థులను బారికేడ్లతో అడ్డుకున్నాయి. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగి రణరంగంగా మారింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో నిరసన స్థలంలో తొక్కిసలాట జరిగింది. ఈ హింసాత్మక ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







