ధోఫార్ ఖరీఫ్ సీజన్‌.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!

- July 21, 2026 , by Maagulf
ధోఫార్ ఖరీఫ్ సీజన్‌.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!

సలాలా: ఒమాన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌లో జరుగుతున్న ఖరీఫ్ సీజన్–2026 సందర్భంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల సంరక్షణ డైరెక్టరేట్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. స్థానికులతో పాటు పర్యాటకులకు సురక్షితమైన వినియోగదారుల వాతావరణాన్ని కల్పించడం, వ్యాపారులు నిబంధనలు పాటించేలా చూడడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం 52 మంది ఇన్‌స్పెక్టర్లను 19 ఫీల్డ్ బృందాలుగా ఏర్పడి ఉదయం, సాయంత్రం, సెలవు రోజుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటిలో 10 బృందాలు సలాలా నగరం, పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుండగా, ధోఫార్‌లోని ప్రతి విలాయత్‌కు ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఖరీఫ్ సీజన్‌లో అధిక రద్దీ ఉండే హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలు, సంప్రదాయ మార్కెట్లు, కొబ్బరి, పండ్ల దుకాణాలు, మధబీ రెస్టారెంట్లు, సుగంధ ద్రవ్యాలు, దుస్తుల షాపులు, స్వీట్స్ దుకాణాలు, పెట్రోల్ బంకులు, వాహన అద్దె కేంద్రాలు వంటి వ్యాపార సంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ధరల ప్రదర్శన, బిల్లుల జారీ, ఉత్పత్తుల నాణ్యత, వాణిజ్య సమాచారం కచ్చితత్వం, అనవసర ధరల పెంపు, వినియోగదారులను తప్పుదోవ పట్టించే చర్యలపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. పర్యాటకులకు సులభంగా సేవలు అందించేందుకు ఇతిన్ ప్లెయిన్ ప్రాంతంలో తాత్కాలిక ఫీల్డ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫిర్యాదులు, ఫిర్యాదు నివేదికలు, సందేహాలను స్వీకరించి వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డైరెక్టరేట్‌కు 549 వినియోగదారుల ఫిర్యాదులు అందగా, వాటిలో 95.97 శాతం కేసుల్లో ఐదు పని దినాల్లో ప్రాథమిక చర్యలు, 91.3 శాతం కేసుల్లో 20 పని దినాల్లో పూర్తిస్థాయి పరిష్కారం అందించారు. అలాగే వచ్చిన 25 నివేదికల్లో రెండు పని దినాల్లో 92.59 శాతం ప్రాథమిక చర్యలు, ఐదు పని దినాల్లో 100 శాతం కేసులను పూర్తిగా పరిష్కరించారు. ఇదే కాలంలో ధోఫార్‌లోని అన్ని విలాయత్‌లలో కలిపి 17,778 తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

అమలు చర్యలతో పాటు "యోర్ అవేర్‌నెస్ ఈజ్ యోర్ సేఫ్టీ" పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధాన ప్రదర్శన, షాపింగ్ మాల్స్‌లో మొబైల్ సమాచార కేంద్రాలు, సమ్మర్ సెంటర్లు, స్కౌట్ క్యాంపులు, పిల్లలు, కుటుంబాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే, వర్చువల్ రియాలిటీ అనుభవాలు, డిజిటల్ ట్యాబ్లెట్లు, పిల్లల థియేటర్, గ్రంథాలయం, పర్యావరణ పరిరక్షణ విభాగం, నిషేధిత మరియు నకిలీ వస్తువుల ప్రదర్శనలు వంటి ఇంటరాక్టివ్ కార్యక్రమాల ద్వారా వినియోగదారుల్లో అవగాహన పెంపొందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com