దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!

- July 22, 2026 , by Maagulf
దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!

దుబాయ్: పాదచారుల భద్రతను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) వినూత్న చర్యలు చేపట్టింది. ఎమిరేట్‌లోని 30 పెడెస్ట్రియన్ బ్రిడ్జిలపై మోషన్ సెన్సార్ ఆధారిత స్మార్ట్ LED లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ఆర్‌టీఏ 'పీపుల్ హ్యాపినెస్' కార్యక్రమంలో భాగంగా అమలు చేయనున్నారు. రహదారులు దాటే పాదచారులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడం, అలాగే పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎకానమీ లక్ష్యాలను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని అథారిటీ తెలిపింది.

నడిస్తేనే వెలిగే లైట్లు
కొత్త వ్యవస్థలో ఏర్పాటు చేసే ఎల్ఈడీ లైట్లు మోషన్ సెన్సార్ సాంకేతికతతో పనిచేస్తాయి. వంతెనపై ఎవరైనా నడుస్తున్నట్లు గుర్తించిన వెంటనే లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. ఎవరూ లేని సమయంలో అవి ఆఫ్ అవుతాయి. దీంతో విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గడంతో పాటు రాత్రి వేళల్లో పాదచారుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్‌టీఏ తెలిపింది. ప్రాజెక్టు అమలుకు ముందు అన్ని 30 బ్రిడ్జిల వద్ద అధికారులు సమగ్ర సర్వేలు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న లైటింగ్ స్థాయిని ప్రత్యేక పరికరాలతో కొలిచి, ప్రతి బ్రిడ్జికి అవసరమైన వెలుతురు ప్రమాణాలను నిర్ణయించారు. ఆ మేరకు కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.

2026 చివరి నాటికి పూర్తి
మొదటి దశలో 21 బ్రిడ్జిల్లో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటితో సహా మొత్తం ప్రాజెక్టును 2026 నాలుగో త్రైమాసికం నాటికి పూర్తి చేయాలని ఆర్‌టీఏ లక్ష్యంగా పెట్టుకుంది. దుబాయ్‌లోని రహదారులు, పెడెస్ట్రియన్ బ్రిడ్జిల శక్తి సామర్థ్యాన్ని పెంచే ఆధునిక సాంకేతికతలను మరింత విస్తృతంగా అమలు చేస్తూ, పర్యావరణహిత నగరంగా దుబాయ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆర్‌టీఏ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com