కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- July 22, 2026
ముంబై: దేశవాళీ క్రికెట్ సీజన్ 2026-27 ముందు బీసీసీఐ పలు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) సూచించిన ఈ మార్పులను అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది.
ఉద్దేశపూర్వక ఫ్రంట్-ఫుట్ నో-బాల్ వేస్తే మ్యాచ్ మొత్తానికి సస్పెన్షన్..
ఇప్పటి వరకు బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్-ఫుట్ నో-బాల్ లేదా నాన్-ల్యాండింగ్ డెలివరీ (బంతి సరైన విధంగా పిచ్పై పడకుండా వేయడం) వేస్తే, అతడిని ఆ ఇన్నింగ్స్లో మాత్రమే బౌలింగ్ చేయకుండా నిలిపివేసేవారు. కొత్త నిబంధన ప్రకారం.. అలాంటి చర్య ఉద్దేశపూర్వకమని ఆన్-ఫీల్డ్ అంపైర్లు నిర్ణయిస్తే.. ఆ బౌలర్ మిగిలిన మ్యాచ్ మొత్తంలో బౌలింగ్ చేసేందుకు వీలుండదు.
ఆఖరి ఓవర్లో వికెట్ పడితే..
ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్లలో ఆఖరి ఓవర్లో వికెట్ పడితే అక్కడితో ఆ రోజు ముగుస్తుంది. కానీ కొత్త నిబంధన ప్రకారం అలా ముగియదు. ఆ ఓవర్లో మిగిలిన బంతులను వేయాల్సి ఉంటుంది.
చివరి ఇన్నింగ్స్లో నో డిక్లేర్
ఇకపై జట్లు చివరి ఇన్నింగ్స్లో డిక్లేర్ (Declare) చేయడం లేదా మ్యాచ్ డ్రాకు అంగీకరించడం వంటివి చేయకూడదు. ఈ నిర్ణయం వల్ల మ్యాచ్ల పోటీతత్వం, విశ్వసనీయత మరింత పెరుగుతుందని బోర్డు భావిస్తోంది.
డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి రావచ్చు
దేశీయ వన్డే మ్యాచ్లలో ఇకపై డ్రింక్స్ బ్రేక్ సమయంలో జట్టు హెడ్ కోచ్ మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఇదే మార్పును అమలు చేయాలని ఐసీసీ ప్రతిపాదించింది.
వికెట్కీపర్లకు ఉపశమనం
గతంలో బౌలర్ రన్-అప్ ప్రారంభించినప్పటి నుంచి బంతి వేసే వరకు వికెట్ కీపర్ గ్లౌవ్స్ను స్టంప్స్ వెనకాలే ఉంచాల్సి ఉండేది. ఇక పై అలా చేయనవసరం లేదు. కొత్త నిబంధన ప్రకారం.. బౌలర్ బంతిని వేసే క్షణంలో మాత్రమే గ్లౌవ్స్ స్టంప్స్ వెనుక ఉంటే సరిపోతుంది.
గతంలో ఈ నిబంధన కారణంగా కొన్ని సందర్భాల్లో నో-బాల్ ప్రకటించడం లేదా స్టంపింగ్ను రద్దు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
వచ్చే నెలలో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో ప్రారంభమయ్యే దేశీయ సీజన్కు ముందే ఈ కొత్త నిబంధనలపై అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు రాష్ట్ర క్రికెట్ సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!







