ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన

- July 24, 2026 , by Maagulf
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన

న్యూ ఢిల్లీ: నీట్ యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపివేస్తోంది. ఈ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ (INDIA) కూటమికి చెందిన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని ‘మకరద్వారం’ వద్ద వరుసగా నాలుగో రోజు తమ నిరసనను కొనసాగించారు. శుక్రవారం ఉదయం సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మకరద్వారం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి”, “విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు” అంటూ రాసి ఉన్న ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని కేంద్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా హోరెత్తించేలా నినాదాలు చేశారు.

గురువారం నాటి ఉద్రిక్తత, ఇరు పక్షాల ఘర్షణ

అంతకుముందు రోజు (గురువారం) పార్లమెంట్ మకరద్వారం వద్ద అత్యంత ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్న సమయంలోనే ఎన్డీయే (NDA) కూటమికి చెందిన ఎంపీలు కూడా అక్కడికి చేరుకుని పోటీ నిరసన చేపట్టారు. నీట్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశాయి.నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, విపక్షాలు ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తున్నాయని అధికార పక్ష నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరగడంతో భద్రతా సిబ్బంది (CISF) జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పేపర్ లీక్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినప్పటికీ, విపక్షాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలిగించి, బాధితులైన విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పిన తర్వాతే సభలో చర్చకు సిద్ధమని విపక్ష నాయకులు స్పష్టం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com