చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

- September 15, 2026 , by Maagulf
చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

హైదరాబాద్: హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నగరంలోని చారిత్రక, వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను సీఎం కొనియాడారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, సీఎస్ సంజయ్ జాజుతో పాటు పలువురు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. నగరంలో శిథిలావస్థకు చేరుకుంటున్న ప్రముఖ చారిత్రక నిర్మాణాలను కాపాడుకునేందుకు ఫౌండేషన్ సహకరించాలని సీఎం కోరారు: ఆగా ఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో గతంలో అసెంబ్లీలోని శాసన మండలి భవనాన్ని, కుతుబ్ షాహీ టూంబ్స్‌ను అత్యద్భుతంగా పునరుద్ధరించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. పాతబస్తీలోని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ‘సిటీ కాలేజ్’ మరియు ‘ఉస్మానియా ఆసుపత్రి’ పాత భవనాల పునరుద్ధరణకు సాంకేతిక, ఆర్థిక సాయం అందించాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌కు విజ్ఞప్తి చేశారు.

మూసీ పునరుజ్జీవం & నైట్ ఎకానమీ
మూసీ నది ప్రక్షాళన మరియు నది పరివాహక ప్రాంతాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలను ఆగా ఖాన్ ప్రతినిధులకు సీఎం వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ‘నైట్ ఎకానమీ’ (Night Economy) హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ప్రిన్స్ ఆగా ఖాన్‌ను సీఎం ఆహ్వానించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో పర్యావరణహిత ‘నెట్-జీరో సిటీ’ (Net-Zero City) గా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com