హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!

- July 25, 2026 , by Maagulf
హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!

రియాద్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ దాడులకు ప్రతిస్పందనగా యెమెన్‌లోని హుదైదా గవర్నరేట్ లో హౌతీల సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు యెమెన్‌లో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కూటమి (Coalition to Restore Legitimacy in Yemen) ప్రకటించింది.

కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ టుర్కీ అల్ మాలికీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం హౌతీల బాధ్యతారాహిత్య చర్య అని విమర్శించారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో భద్రతకు హౌతీలు పదేపదే ముప్పు కలిగిస్తున్నారని తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించేందుకు హౌతీలు ఉపయోగిస్తున్న సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగానే చర్యలు చేపట్టామని తెలిపారు. నిర్దేశించిన అన్ని ఆపరేషన్ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.

హుదైదా పోర్టును లక్ష్యంగా చేసుకోలేదని..  హుదైదా, రాస్ ఈసా, సలీఫ్ నౌకాశ్రయాలు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, చమురు, నిర్మాణ సామగ్రితో వచ్చే వాణిజ్య నౌకల కోసం యథావిధిగా పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే యెమెన్ విమానాశ్రయాల నుంచి విమాన రాకపోకలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.

అయితే, సనా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను హౌతీలు అడ్డుకుంటున్నారని, దీంతో యెమెన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ మానవతా సంక్షోభం మరింత తీవ్రమవుతోందని అల్ మాలికీ ఆరోపించారు.

యెమెన్ ప్రజలు, ఆ దేశ చట్టబద్ధ ప్రభుత్వానికి సౌదీ అరేబియా సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. సౌదీ ప్రయోజనాలు, జాతీయ ఆస్తులు, వాణిజ్య నౌకల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు కొనసాగిస్తామని, హౌతీలు మరిన్ని దాడులకు పాల్పడితే మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com