డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- July 26, 2026
దుబాయ్: ప్రత్యేక రకం డిసప్పియర్ ఇంక్ (Disappearing Ink) ఉపయోగించి చెక్కు జారీ చేసి మోసం చేసిన ఓ అరబ్ వ్యక్తికి దుబాయ్ సివిల్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. Dh1.7 మిలియన్ పూర్తిగా తిరిగి చెల్లించడంతో పాటు, బాధితుడికి Dh30,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు తీర్పు ప్రకారం.. చెక్కు చెల్లించాల్సిన తేదీ నుంచి మొత్తం బకాయి చెల్లించే వరకు ఏడాదికి 5 శాతం చట్టబద్ధ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కోర్టు ఫీజులు, ఇతర న్యాయపరమైన ఖర్చులు కూడా నిందితుడే భరించాలని స్పష్టం చేసింది.
బాధితుడు నిందితుడికి Dh1.7 మిలియన్ అప్పుగా ఇవ్వగా, భద్రత కోసం అతను ఒక చెక్కు ఇచ్చాడు. చెక్కు జారీ చేసిన సమయంలో అందులోని వివరాలన్నీ సక్రమంగానే కనిపించాయి. అయితే గడువు తేదీన బాధితుడు ఆ చెక్కును బ్యాంకులో సమర్పించగా, చెక్కుపై ఉన్న వివరాలు మారిపోయినట్లు బ్యాంకు గుర్తించింది. కాలక్రమేణా మాయమయ్యేలా రూపొందించిన ప్రత్యేక కరెక్షన్ ఫ్లూయిడ్ (ఇంక్)తో చెక్కు రాయడం వల్ల అది చెల్లుబాటు కాకపోవడంతో బ్యాంకు నగదు చెల్లించేందుకు నిరాకరించింది.
దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, చెక్కును నగదుగా మార్చకుండా ఉండేందుకు నిందితుడు ఉద్దేశపూర్వకంగా ఈ మోసపూరిత పద్ధతిని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన క్రిమినల్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అనంతరం అప్పీల్ కోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. కోర్ట్ ఆఫ్ కసేషన్లో ఎలాంటి అప్పీల్ దాఖలు చేయకపోవడంతో ఆ తీర్పు ఖరారైంది.
క్రిమినల్ కోర్టు తుది తీర్పు సివిల్ కోర్టుకు కూడా వర్తిస్తుందని పేర్కొన్న సివిల్ కోర్టు, నిందితుడు ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడ్డాడని స్పష్టం చేసింది. బాధితుడి డబ్బును చట్టబద్ధమైన కారణం లేకుండా ఎన్నో సంవత్సరాల పాటు తన వద్ద ఉంచుకున్నాడని, తన సొమ్ము తిరిగి పొందేందుకు బాధితుడు క్రిమినల్, సివిల్ కోర్టుల చుట్టూ ఎన్నో సంవత్సరాలు తిరగాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. ఈ సుదీర్ఘ న్యాయపోరాటం వల్ల బాధితుడు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాడని గుర్తించిన కోర్టు, Dh30,000 నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







