పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

- September 12, 2026 , by Maagulf
పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్‌:  పదవి, అధికారం కంటే దేశ సేవకే ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. ఆయన నాయకత్వం, క్రమశిక్షణ, దేశం పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌లో యువ న్యాయవాది అంబర్‌ అగర్వాల్‌ రచించిన ‘Governance of the Self: 75 Lessons in Leadership, Discipline, and Service’ పేరుతో రచించిన పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్, ఇతర గెస్ట్ లతో కలిసి ఆవిష్కరించారు. రచయిత యువ న్యాయవాది అంబర్‌ అగర్వాల్‌ కు గవర్నర్ అభినందించారు.

ఈ సందర్భంగా గవర్నర్ తన సందేశాన్ని ఇచ్చారు.నాయకత్వం ముందుగా మనల్ని మనం పాలించుకోవడంతోనే ప్రారంభమవుతుందని గవర్నర్‌ అన్నారు. స్వీయ క్రమశిక్షణ, సంయమనం, కర్తవ్యనిష్ఠ, నిస్వార్థ సేవలను జీవితంలో ఆచరించినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇతరులకు చెప్పే విషయాలను ముందుగా తాము ఆచరించాలని సూచించారు.పదవులు, అధికారాలు శాశ్వతం కావని.. ప్రజా జీవితంలో చేసిన సేవలే చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. సింహాసనం అధిష్ఠించడమే లక్ష్యంగా కాకుండా దేశ ప్రయోజనాలే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.ప్రధాని మోదీకి పలు దేశాలు అత్యున్నత గౌరవాలు అందించిన విషయాన్ని గవర్నర్‌ ప్రస్తావించారు. ఆయా గౌరవాలను వ్యక్తిగత గౌరవంగా కాకుండా భారతదేశానికి దక్కిన గౌరవంగా ప్రధాని భావించడం ఆయన దేశభక్తికి నిదర్శనమన్నారు. ప్రపంచ వేదికపై భారత్‌ ప్రతిష్ఠను పెంచుతున్నారని తెలిపారు.

వేగం కంటే నిరంతర కృషి ముఖ్యమని గవర్నర్‌ అన్నారు. కుందేలు–తాబేలు కథను ఉదాహరణగా చెబుతూ.. తీవ్రత కంటే నిరంతరతే విజయానికి కీలకమని పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక, పరిపాలనా రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ సంయమనం, కర్తవ్యనిష్ఠ, నిస్వార్థ సేవను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు “నేను దేశానికి ఏమి చేయాలి?” అని ఆలోచించాలని గవర్నర్‌ సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి సేవాభావంతో పనిచేస్తే బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించగలమని శివప్రతాప్‌ శుక్లా పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాండే, మాజీ డీజీపీ డాక్టర్‌ అరవింద్‌రావు, సామాజిక కార్యకర్త తేమ్సుతులా ఇమ్సోంగ్‌ లు తమ సందేశంలోయువతలో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు అంబర్‌ అగర్వాల్‌ రచించిన ‘Governance of the Self: 75 Lessons in Leadership, Discipline, and Service’  దోహదం చేస్తుందన్నారు. చిన్న వయస్సులో మంచి పుస్తకం రచించారని పేర్కొంటూ అంబర్‌ అగర్వాల్‌  లు అభినందించారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ లు ధర్మపురి అరవింద్ , అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే లు రాకేష్ రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ తో పాటు పలువురు విద్యావేత్తలు, ప్రముఖులు, యువత, పుస్తక ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com