ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

- August 01, 2026 , by Maagulf
ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

విజయనగరం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.

డీజీపీ భోగాపురం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెర్మినల్ భవనం, ప్రధానమంత్రి పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణం, థింసా నృత్య ప్రదర్శన జరిగే ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈగల్ ఐజీ ఏ.కే. రవికృష్ణ, ప్రధాని పర్యటన కోసం వివిధ ప్రాంతాల్లో సుమారు 3,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఎల్‌ఈడీ స్క్రీన్లతో అనుసంధానం చేసినట్లు డీజీపీకి వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా క్రౌడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు, సభా ప్రాంగణాన్ని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.

అనంతరం డీజీపీ టెర్మినల్ భవనంలోని అంతర్గత ప్రాంతాలను పరిశీలించి, ప్రధానమంత్రి సభా వేదికకు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలకు వెళ్లే మార్గాలను పరిశీలించారు. జిల్లా పోలీసు శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ డీజీపీకి వివరించారు.

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, బందోబస్తు, భద్రత, ట్రాఫిక్ బాధ్యతలు నిర్వహించే సీనియర్ అధికారులు తమ ఆధ్వర్యంలోని సిబ్బందితో సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని సూచించారు.

సభ ముగిసిన అనంతరం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా పెద్ద సైజు సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేసి, వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలకు సక్రమంగా మళ్లించాలని సూచించారు.

డీజీపీ వెంట అదనపు డీజీ ఎన్. మధుసూదన్ రెడ్డి, గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఐజీ కె. శ్రీకాంత్, ఈగల్ ఐజీ ఏ.కే. రవికృష్ణ, విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com