ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!

- August 02, 2026 , by Maagulf
ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!

దోహా: ఖతార్‌లోని సౌక్ వాఖిఫ్‌లో జరుగుతున్న 11వ స్థానిక డేట్స్ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభమైన తొలి ఆరు రోజుల్లోనే సుమారు 38 వేల మంది సందర్శకులు ప్రదర్శనను సందర్శించారు. ఈ కాలంలో దాదాపు 76,500 కిలోల డేట్స్ విక్రయమైనట్లు ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ వ్యవసాయ సలహా, సేవల విభాగం అధిపతి అహ్మద్ సలేం అల్-యాఫీ వెల్లడించారు.

ఈ ఏడాది ప్రదర్శనలో 125 స్థానిక వ్యవసాయ క్షేత్రాలు పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. ఉత్తమ నాణ్యత గల ఖతారీ ఖర్జూరాలతో పాటు అత్తిపండ్లు, అరటిపండ్లు, బొప్పాయి, బాదం వంటి స్థానికంగా పండించిన కాలానుగుణ పండ్లను కూడా రైతులు విక్రయిస్తున్నారని చెప్పారు. ఆగస్టు 10 వరకు సౌక్ వాఖిఫ్ ఈస్టర్న్ స్క్వేర్ లో కొనసాగే ఈ ప్రదర్శన ఖతార్ డేట్స్ నాణ్యత, వైవిధ్యాన్ని ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశంలోని డేట్స్ సాగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోంది.

స్థానిక రైతులకు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశాన్ని కల్పించడంతో పాటు అవసరమైన లాజిస్టిక్ సహాయాన్ని కూడా మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ అందిస్తోందని అల్-యాఫీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ను పొందుతున్నారని పేర్కొన్నారు. ఈసారి ప్రదర్శనలో 114 రకాల స్థానిక డేట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శన ఆదివారం నుంచి గురువారం వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, శుక్రవారం, శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com