గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి

- August 03, 2026 , by Maagulf
గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు  మృతి

గ్రీస్‌లో భారీ కార్చిచ్చును అణచివేసేందుకు సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక విభాగానికి చెందిన రెండు హెలికాప్టర్లు గాలిలోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఏథెన్స్‌లోని తీర ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అడవుల్లో వ్యాపించిన మంటలను నియంత్రించే క్రమంలో ఈ విషాదం సంభవించింది.

రోటార్లు తాకడంతో గాలిలోనే పేలిపోయిన హెలికాప్టర్
అటికా-బొయోటియా సరిహద్దు అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను ఆర్పుతున్న గ్రీస్ ఫైర్ సర్వీస్‌కు చెందిన రెండు ‘బెల్’ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో భాగమయ్యాయి. మంటలను ఆర్పే సమయంలో ఈ రెండు విమానాలు అత్యంత సమీపంలోకి రావడం వల్ల వాటి రెక్కలు (రోటార్లు) ఒకదానికొకటి బలంగా తగిలాయి. ఫలితంగా ఒక హెలికాప్టర్ గాలిలోనే పేలిపోయి నేలకూలింది.

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి
ప్రమాద వార్త తెలిసిన వెంటనే సహాయక బృందాలు వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు పైలట్లను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. గ్రీస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వాసిలిస్ వత్రాకోగియానిస్ ఈ ప్రమాదాన్ని, ప్రాణనష్టాన్ని అధికారికంగా నిర్ధారించారు.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్
ఈ హృదయ విదారక ఘటనపై గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీర పైలట్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com