ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- August 04, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత రెండేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, సాధించిన పురోగతిని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
2019-2024 మధ్యకాలంలో వైకాపా పాలనలో రాష్ట్రం తీవ్ర విధ్వంసానికి గురైందని, ప్రజలు భయాందోళనల మధ్య జీవించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వ్యవస్థలు కుప్పకూలిపోవడం, శాంతిభద్రతల సమస్యలు, పరిశ్రమలు తరలిపోవడం వల్ల ‘బ్రాండ్ ఏపీ’ తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన విజయాన్ని ఒక ఊహించని విప్లవంగా అభివర్ణించిన ఆయన, అధికారంలోకి వచ్చిన కొత్తలో 7 శ్వేతపత్రాలు ఇచ్చామని, ఇప్పుడు వాటికి కొనసాగింపుగా ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేస్తున్నామని చెప్పారు.
అభివృద్ధికి చిహ్నంగా భోగాపురం విమానాశ్రయం ఒక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పడానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమే ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏపీకి గేట్వేగా మారనుందని చెప్పారు. ఐటీ, డేటా సెంటర్లు, పోర్టులు, విమానాశ్రయాలు, స్టీల్ పరిశ్రమలతో రాష్ట్రం ఒక భారీ గ్రోత్ ఇంజిన్గా రూపాంతరం చెందుతోందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన లోటు & తెలంగాణతో తలసరి ఆదాయ వ్యత్యాసం
2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిందని సీఎం గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 శాతం జనాభా ఏపీలో ఉన్నప్పటికీ, కేవలం 46 శాతం వనరులు మాత్రమే దక్కాయని తెలిపారు. విభజన అనంతరం రాజధాని లేకపోవడం, ఆస్తుల పంపకం సక్రమంగా జరగకపోవడం రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉండగా, విభజన తర్వాత తెలంగాణలో అది రూ.1,24,104కు చేరిందని చెప్పారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.93,903గా నమోదైందని పేర్కొన్నారు. దీంతో తెలంగాణతో పోలిస్తే ఏపీ తలసరి ఆదాయంలో రూ.30,201 వ్యత్యాసం ఏర్పడిందని సీఎం వివరించారు.
30.5% CAGR వృద్ధి.. గాడిలో పడుతున్న ఏపీ ఆర్థిక వ్యవస్థ!
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించామని, దాని ఫలితంగా 30.5 శాతం సీఏజీఆర్ (CAGR) వృద్ధి నమోదు కావడం చారిత్రాత్మక విజయమని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీ (GSDP) వృద్ధి రేటు 13.5 శాతంగా ఉండగా, అప్పులు–జీఎస్డీపీ నిష్పత్తి 28.38 శాతంగా ఉందన్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న వనరుల వ్యత్యాసాన్ని (Resource Gap) 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించగలిగామని వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు క్వాంటం టెక్నాలజీ వంటి ప్రగతిశీల రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్పోర్ట్కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం







