ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..

- August 06, 2026 , by Maagulf
ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో(AP Cabinet) పలు కీలక, ప్రాధాన్యత కలిగిన నిర్ణయాలకు ఆమోదం లభించింది.సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మొత్తం 34 అజెండా అంశాలపై విస్తృతంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026’తో పాటు ‘ఏపీ పీపీపీ పాలసీ-2026’ ముసాయిదాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించుకుని, బాధితులకు మరింత న్యాయం చేకూరేలా పటిష్టమైన నూతన చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారు.

అమరావతి నిర్మాణానికి భారీ నిధులు:
రాజధాని అమరావతి రూపురేఖలు మార్చేలా పలు కీలక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి ఏకంగా రూ.1002.49 కోట్లు కేటాయిస్తూ, ఈ పనుల బాధ్యతను ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు అంగీకారం కూడా తెలిపింది. అలాగే అసెంబ్లీ, హైకోర్టుల నూతన డిజైన్ల కోసం అదనపు నిధుల కేటాయింపుతో పాటు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం (GoM) చేసిన సిఫార్సులను ఆమోదించింది. దీంతో పాటు నిలిచిపోయిన ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు తిరిగి రీ-టెండర్లు పిలిచేందుకు క్యాబినెట్ నిర్ణయించింది.

పరిపాలనా సంస్కరణలు, మౌలిక వసతులు:
రాష్ట్రంలో పాదచారుల భద్రత పాలసీ-2026 అమలుకు ఆమోదం తెలిపిన క్యాబినెట్, విద్యా రంగానికి ప్రోత్సాహంగా రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. కొత్త జిల్లాల అవసరాలకు అనుగుణంగా 15 నూతన డీఈవో (DEO) పోస్టుల మంజూరుకు సమ్మతి తెలిపింది. మున్సిపల్ భూముల లీజు గడువు పెంపునకు సంబంధించి చట్టసవరణలు చేయడం, పట్టణాభివృద్ధి సంస్థల (UDA) పునర్వ్యవస్థీకరణకు ఆమోదముద్ర వేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పరిపాలనను మరింత సుగమం చేసేందుకు ప్రభుత్వం బాటలు పరిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com