వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!

- August 07, 2026 , by Maagulf
వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!

దోహా: దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆహార భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) సూచించింది. వేసవిలో సరైన విధంగా ఆహారాన్ని తయారు చేయడం, నిల్వ చేయడం, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆహార సంబంధిత వ్యాధులను నివారించవచ్చని పేర్కొంది.

40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం అత్యంత కీలకమని తెలిపింది. ఆహారాన్ని తయారు చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, పచ్చి ఆహారం, వండిన ఆహారాన్ని వేర్వేరుగా ఉంచాలని, ఫ్రీజర్‌లోని ఆహారాన్ని గది ఉష్ణోగ్రతలో కాకుండా ఫ్రిజ్‌లోనే కరిగించాలని సూచించింది. వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆహారం తయారు చేయకూడదని హెచ్చరించింది.

ఆహార నిల్వ విషయంలో ఫ్రిజ్‌లో ఉంచే పదార్థాలను 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో, వేడి ఆహారాన్ని 65 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలని పేర్కొంది. వండిన ఆహారాన్ని రెండు గంటలకు మించి బయట ఉంచరాదని, ఒకసారి కరిగించిన ఆహారాన్ని మళ్లీ ఫ్రీజ్ చేయకూడదని స్పష్టం చేసింది.

అలాగే లైసెన్స్ పొందిన రెస్టారెంట్ల నుంచే ఆహారాన్ని ఆర్డర్ చేయాలని ప్రజలకు సూచించింది. డెలివరీ సమయంలో వేడి ఆహారం వేడిగానే, చల్లటి ఆహారం చల్లగానే అందిందో లేదో నిర్ధారించుకోవాలని, ప్యాకెట్లు బిగుతుగా మూసి ఉండేలా చూసుకోవాలని తెలిపింది.

మిగిలిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని, తిరిగి తినే ముందు పూర్తిగా వేడి చేసి తీసుకోవాలని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com