దుబాయ్‌లో 290 కి.మీ. వేగంతో బైక్‌ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!

- August 08, 2026 , by Maagulf
దుబాయ్‌లో 290 కి.మీ. వేగంతో బైక్‌ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!

దుబాయ్: గంటకు 290 కిలోమీటర్లకు పైగా వేగంతో బైక్ నడుపుతూ, ప్రమాదకర స్టంట్లు చేసిన ఓ మోటార్‌సైకిల్ రైడర్‌పై దుబాయ్ పోలీసులు చర్యలు చేపట్టారు. బైక్‌ను స్వాధీనం చేసుకుని, రైడర్‌ను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. బైక్‌ను తిరిగి ఇచ్చేందుకు 50,000 దిర్హామ్ ఇంపౌండ్‌మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి అదనంగా వర్తించే ఇతర చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని వెల్లడించారు.

290 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో బైక్ నడుపుతూ ప్రయాణించడం, వాహనాల మధ్య అత్యంత ప్రమాదకరంగా దూసుకెళ్లడం వంటి స్టంట్లు చేస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. వీడియో ఆధారంగా ప్రత్యేక ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాలు రైడర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలీం బిన్ సువైదాన్ తెలిపారు.

గంటకు 290 కిలోమీటర్లకు పైగా వేగంతో మోటార్‌సైకిల్ నడపడం అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ ప్రవర్తనల్లో ఒకటని పోలీసులు హెచ్చరించారు. ఇంతటి వేగంతో బైక్‌పై నియంత్రణ కోల్పోయే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. బైక్ అదుపు తప్పితే రైడర్‌ చాలా దూరం ఎగిరిపడే అవకాశం ఉంటుందని, రోడ్డు బారియర్లు, విద్యుత్ స్తంభాలు, కాలిబాటలు లేదా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొనే ప్రమాదం ఉందని వివరించారు. ఇతర వాహనాలతో పోలిస్తే మోటార్‌సైకిల్‌పై ప్రయాణించే వారికి ప్రమాద సమయంలో శారీరక రక్షణ చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అధిక వేగంతో వాహనాల మధ్య జిగ్‌జాగ్‌గా దూసుకెళ్లడం వల్ల ఇతర వాహనదారులకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయని పోలీసులు తెలిపారు.

ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్ వల్ల రైడర్ ప్రాణాలకే కాకుండా ఇతర అమాయక వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని, ఒక్కసారిగా తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల వరుస ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.  

ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసే వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు దుబాయ్ పోలీసుల స్మార్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థలు, ఫీల్డ్ పెట్రోలింగ్ బృందాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని బిన్ సువైదాన్ తెలిపారు.“రోడ్లు స్టంట్లు లేదా వేగ పరీక్షలకు వేదికలు కావు” అని ఆయన స్పష్టం చేశారు. మోటార్‌సైకిల్ రైడర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, తమతో పాటు రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరి భద్రతను కాపాడాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com