రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలపై సీడీఏఏ భద్రతా సూచనలు..!!

- August 10, 2026 , by Maagulf
రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలపై సీడీఏఏ భద్రతా సూచనలు..!!

మస్కట్: సమీపంలోని రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం లేదా పేలుడు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దూరంగా వెళ్లడంతో పాటు అధికారుల భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించింది.

 ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి?

* ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి వెంటనే దూరంగా వెళ్లాలి.

* పొగ లేదా రసాయన వాయువుల వైపు వెళ్లకూడదు.

* అధికారులు జారీ చేసే ఖాళీ చేయాలన్న ఆదేశాలను పాటించాలి.

* ప్రమాదాన్ని అత్యవసర నంబర్ 9999కు సమాచారం ఇవ్వాలి.

* ముందుగానే సమీపంలోని అత్యవసర ద్వారాలు, ఖాళీ చేసే మార్గాలను తెలుసుకోవాలి.

* ప్రశాంతంగా ఉండి నిర్దేశించిన మార్గాల్లోనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.

* అగ్ని ప్రమాదం సమయంలో లిఫ్టులను ఉపయోగించకూడదు.

* అధికారులు అనుమతి ఇచ్చే వరకు ప్రభావిత ప్రాంతానికి తిరిగి వెళ్లకూడదు.

 

ప్రమాద నియంత్రణలో సీడీఏఏ కీలక పాత్ర

అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సీడీఏఏ బృందాలు స్పందించి పరిస్థితిని అంచనా వేస్తాయని అధికారులు తెలిపారు. ప్రమాద స్థాయిని పరిశీలించడం, మంటలను అదుపు చేయడం, ప్రమాదకర రసాయనాలను నిర్వహించడం, సహాయక చర్యలు చేపట్టడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతాయి.

అలాగే ప్రభావిత ప్రాంతాలను భద్రపరచడంతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను కొనసాగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు పొగ, మంటలు లేదా ఏదైనా అసాధారణ పరిస్థితిని గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సీడీఏఏ సూచించింది. ధ్రువీకరించని సమాచారాన్ని సోషల్ మీడియాలో లేదా ఇతర మార్గాల్లో ప్రచారం చేయవద్దని కోరింది.

ప్రమాద సమయంలో వేగంగా స్పందించడం, అధికారుల భద్రతా సూచనలను పాటించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సీడీఏఏ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com