ఒమన్‌లో 12 కిలోల ఉల్కాశకలం గుర్తింపు..!!

- August 10, 2026 , by Maagulf
ఒమన్‌లో 12 కిలోల ఉల్కాశకలం గుర్తింపు..!!

మస్కట్: ధోఫార్ గవర్నరేట్‌లో సుమారు 12 కిలోల బరువున్న రాతి ఉల్కాశకలాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులకు సమాచారం అందించిన పౌరుడిని ఒమన్ వారసత్వ, పర్యాటక మంత్రిత్వ శాఖ అభినందించింది.

ధోఫార్‌లోని మితాన్ జిల్లాలో రమ్లత్ జదిలా ప్రాంతంలో ఓ అనుమానాస్పద రాతి నమూనాను గుర్తించిన సయీద్ బిన్ హుమైద్ అల్-హరిజీ అనే సిటిజన్.. అది ఉల్కాశకలం అయి ఉండొచ్చని భావించి అధికారులకు సమాచాం అందించాడు. ఆయన చొరవను ప్రశంసించిన హెరిటేజ్ శాఖ అండర్‌సెక్రటరీ ఇంజినీర్ ఇబ్రహీం బిన్ సయీద్ అల్-ఖరూసీ.. సయీద్‌ను సత్కరించారు.

అనంతరం మంత్రిత్వ శాఖ అధికారులు రాతి నమూనాను శాస్త్రీయంగా నమోదు చేసేందుకు అవసరమైన సాంకేతిక ప్రక్రియలను ప్రారంభించారు. నమూనాను ప్రయోగశాలలో పరీక్షించగా.. అది సుమారు 12 కిలోల బరువున్న రాతి ఉల్కాశకలం అని నిర్ధారణ అయింది. సహజ, భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టం చేస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

శాస్త్రీయ, చారిత్రక విలువ కలిగిన అరుదైన వస్తువులు లేదా ఆవిష్కరణలను ప్రజలు గుర్తించినప్పుడు వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని శాస్త్రీయ విధానాల ప్రకారం నమోదు చేసి, పరిశోధించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొంది.

పౌరుడి చొరవ.. ప్రజలు, ప్రభుత్వ సంబంధిత సంస్థల మధ్య సహకారానికి మంచి ఉదాహరణగా నిలిచిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి ఆవిష్కరణలను పరిరక్షించడం, శాస్త్రీయ మరియు విద్యా రంగాల్లో వాటిని వినియోగించడం ద్వారా ఒమన్‌లోని భౌగోళిక, సహజ సంపదపై అవగాహన మరింత పెరుగుతుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com