మురుగునీటి పనుల్లో యువకుడికి రూ.99 కోట్ల బంగారు నిధి..

- August 16, 2026 , by Maagulf
మురుగునీటి పనుల్లో యువకుడికి రూ.99 కోట్ల బంగారు నిధి..

బెల్జియం: మురుగునీటి వ్యవస్థ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతుండగా ఓ 18 ఏళ్ల యువకుడికి భారీ బంగారు నిధి లభించింది. బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ బంగారు నిధి విలువ సుమారు 90 లక్షల యూరోలు (దాదాపు రూ.99 కోట్లు) ఉంటుందని అంచనా.

‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం.. కేబీ అనే పేరుతో మాత్రమే గుర్తించిన 18 ఏళ్ల విద్యార్థి నిర్మాణ పనుల్లో భాగంగా సహచరులతో కలిసి పనిచేస్తున్నాడు. బ్రస్సెల్స్‌కు వాయువ్యంగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని వాన్ లాంగెన్‌హోవ్‌స్ట్రాట్లోని మాజీ బ్రూవరీ ప్రాంగణంలో మురుగునీటి పైపుల కోసం కాలువలు తవ్వుతుండగా ఈ నిధి బయటపడింది.

మొదట నాణేలనుకున్నారు..

తవ్వకాల్లో భాగంగా నేలలో ఏదో వస్తువు కనిపించడంతో యువకులు దాన్ని బయటకు తీయడం ప్రారంభించారు. తొలుత అవి సాధారణ ఒక యూరో నాణేలు అయి ఉంటాయని భావించినట్లు కేబీ తెలిపారు.

అయితే మరింతగా తవ్విన తర్వాత వారికి బంగారు కడ్డీ కనిపించింది. దీంతో అక్కడ మరింత పెద్ద నిధి దాగి ఉన్నట్లు గుర్తించారు.

బంగారు నాణేలు, కడ్డీలు

బయటపడిన నిధిలో బంగారు నాణేలు, బంగారు ముద్దలు, నంబర్లు ఉన్న బంగారు బులియన్ కడ్డీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఒక సంచిలో ఉంచి, ఒక పెద్ద విల్లా సెల్లార్ గోడలో ఇటుకలతో మూసివేసిన భాగంలో దాచినట్లు తెలుస్తోంది.

ఈ విల్లాను 19వ శతాబ్దం చివర్లో అప్పటి బ్రూవరీ యజమాని థియోఫిలస్ వాన్ అస్చే నిర్మించినట్లు సమాచారం.

కేబీ బెల్జియన్ బ్రాడ్‌కాస్టర్ VTMతో మాట్లాడుతూ.. తవ్వకాల సమయంలో అకస్మాత్తుగా ఏదో కనిపించిందని, తొలుత అవి యూరో నాణేలు అనుకున్నామని చెప్పారు. ఆ తర్వాత బంగారు కడ్డీ కనిపించడంతో తాము ఊహించిన దానికంటే విషయం చాలా పెద్దదిగా మారిందని తెలిపారు.

నిధి ఎవరిది?

ఈ భారీ బంగారు నిధి ఎప్పుడు అక్కడ దాచారు, దాని అసలు యజమాని ఎవరు, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మురుగునీటి నిర్మాణ పనుల్లో సాధారణంగా తవ్వకాలు చేపడుతున్న సమయంలో దాదాపు రూ.99 కోట్ల విలువైన బంగారు నిధి బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com