డీజిల్ చోరీ, టెలికాం టవర్ల ధ్వంసం.. నలుగురు భారతీయుల అరెస్ట్..!!

- August 22, 2026 , by Maagulf
డీజిల్ చోరీ, టెలికాం టవర్ల ధ్వంసం.. నలుగురు భారతీయుల అరెస్ట్..!!

కువైట్ : కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ ప్రాంతంలో డీజిల్ చోరీ, కమ్యూనికేషన్ టవర్లకు నష్టం కలిగించిన కేసుల్లో నలుగురు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తులపై నమోదైన నాలుగు కేసులను దర్యాప్తు చేసిన క్రిమినల్ సెక్యూరిటీ విభాగం నిందితులను గుర్తించింది. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆధునిక సాంకేతిక పద్ధతులు, కమ్యూనికేషన్ టవర్ల పర్యవేక్షణతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నలుగురు భారతీయులు చోరీకి పాల్పడుతున్న సమయంలో పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.

రెండేళ్లుగా చోరీలు?

దర్యాప్తులో నిందితులు కమ్యూనికేషన్ టవర్ల నిర్వహణ కోసం కాంట్రాక్ట్ పొందిన ఓ కంపెనీలో పనిచేస్తున్నట్లు వెల్లడైంది. తమ ఉద్యోగ స్వభావాన్ని ఆసరాగా చేసుకుని అవసరమైన పరిమాణం కంటే ఎక్కువగా డీజిల్‌ను తీసుకునేవారని అధికారులు తెలిపారు. అందులో కొంత డీజిల్‌ను ఇతర టవర్లలో ఏర్పడిన కొరతను భర్తీ చేసేందుకు ఉపయోగించగా, మిగిలిన డీజిల్‌ను బయటకు తీసుకెళ్లి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణలో నిందితులు గత రెండేళ్లుగా కువైట్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇతర గవర్నరేట్లలో నమోదైన ఇలాంటి ఘటనల్లోనూ వీరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితులను సంబంధిత అధికారులకు అప్పగించే ముందు ప్రస్తుతం ఇన్వెంటరీ, దర్యాప్తు ప్రక్రియలు కొనసాగుతున్నాయని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని కీలక మౌలిక వసతులు, సదుపాయాల రక్షణకు కట్టుబడి ఉన్నామని, వాటికి నష్టం కలిగించే లేదా దేశ ప్రయోజనాలకు హాని చేసే చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com