ఇజ్రాయెల్ E1 సెటిల్‌మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!

- August 22, 2026 , by Maagulf
ఇజ్రాయెల్ E1 సెటిల్‌మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!

రియాద్: ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సెటిల్‌మెంట్ విధానాలను సౌదీ అరేబియాతో పాటు మరో ఏడు దేశాలు తీవ్రంగా ఖండించాయి. తూర్పు జెరూసలేం సమీపంలోని E1 సెటిల్‌మెంట్ ప్రణాళికను వెంటనే నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. సౌదీ అరేబియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, పాకిస్థాన్, టర్కియే, ఖతార్, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

E1 ప్రణాళికతో పాటు ఇతర సెటిల్‌మెంట్ కార్యకలాపాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ అధికారుల మద్దతుతో సెటిలర్లు పాలస్తీనియన్లు, వారి ఆస్తులపై హింసకు పాల్పడుతున్నారని మంత్రులు ఆరోపించారు. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టానికి, ఐక్యరాజ్యసమితి సంబంధిత తీర్మానాలకు విరుద్ధమని పేర్కొన్నారు. E1 ప్రణాళిక అమలైతే వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం మధ్య భౌగోళిక అనుసంధానం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది 1967 సరిహద్దుల ఆధారంగా తూర్పు జెరూసలేంను రాజధానిగా కలిగిన స్వతంత్ర, భౌగోళికంగా అనుసంధానమైన పాలస్తీనా దేశ ఏర్పాటుకు తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.

రెండు దేశాల పరిష్కారమే మార్గం

అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా రెండు దేశాల పరిష్కారమే న్యాయమైన, సమగ్ర, శాశ్వత శాంతికి ఏకైక మార్గమని ఎనిమిది దేశాల మంత్రులు పునరుద్ఘాటించారు. అక్రమ సెటిల్‌మెంట్ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలపై అంతర్జాతీయ చర్యలు, అవసరమైన ఆంక్షలు విధించడంతో పాటు వాటికి ఆర్థిక సహాయం లేదా మద్దతు అందకుండా చూడాలని కోరారు.

E1 ప్రణాళిక కింద తీసుకున్న చర్యలను వెనక్కి తీసుకోవాలని, సెటిల్‌మెంట్ విస్తరణను నిలిపివేయాలని, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల భౌగోళిక, జనాభా స్వరూపాన్ని మార్చే చర్యలను తక్షణమే ఆపాలని పిలుపునిచ్చారు. అలాగే పాలస్తీనా ప్రజల స్వయంప్రతిపత్తి హక్కు, స్వతంత్ర పాలస్తీనా దేశ స్థాపన హక్కులను కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజం అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com