ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

- August 24, 2026 , by Maagulf
ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

అమరావతి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరులో నాన్-జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబుతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి సభలోని వారిని ఎంతగానో అలరించారు.తనకు తెలుగు అర్థమవుతుందని, కానీ స్పష్టంగా మాట్లాడలేనని ఆయన సరదాగా పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా పండుగలు–సంక్రాంతి ప్రాముఖ్యత

మన దేశంలో జనవరి 14న నిర్వహించే సంక్రాంతి పంటల పండుగను వివిధ రాష్ట్రాల్లో విభిన్న పేర్లతో కలిసికట్టుగా జరుపుకుంటామని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్‌గా, పంజాబ్‌లో లోహ్రీగా, అసోంలో బిహూగా ఈ వేడుకలను జరుపుకుంటామని వివరించారు.

పాప్‌కార్న్ రంగంలో దేశీయ ఆత్మనిర్భరత

దేశంలో 8 రాష్ట్రాలకు చెందిన 17,500 మంది రైతులు సుమారు 40 వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మొక్కజొన్నను సాగు చేయడం ఎంతో అభినందనీయమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఇప్పటివరకు అమెరికా నుంచి పాప్‌కార్న్ దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ స్థితి మారి మనమే అమెరికాకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతుల సంక్షేమం–నదుల అనుసంధానంపై ఆశాభావం
రైతన్నల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతులకు డ్రోన్లను అద్దెకు అందించే పథకం కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 1,200 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. మహానది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం కేవలం కలగానే మిగిలిపోదని, కొంత సమయం పట్టినా భవిష్యత్తులో అది తప్పకుండా వాస్తవ రూపం దాలుస్తుందని ఆయన పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com